Farmers ate the Tiger: విద్యుత్ కంచె తగిలి మరణించిన పులి.. వండుకు తినేసిన స్థానిక రైతులు?

Farmers ate the Tiger: పంట చేనుకు రక్షణగా అమర్చుకున్న విద్యుత్ తీగలు తగిలి పులి మరణించగా.. గుట్టుచప్పుడు కాకుండా స్థానిక రైతులు వండుకు తినేసినట్లు అనుమానిస్తున్నారు. పులి గోళ్ళ పంపకం దగ్గర తేడాలు రావడంతో విషయం బయటకి పొక్కిన ఘటన ఏపీలోకి ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాదముద్రలను గుర్తించారు.
దీంతో పులి ఆచూకీని తెలుసుకునే క్రమంలో ఫారెస్ట్ అధికారులు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. మరోవైపు, పులి సంచరిస్తుందని.. సమీప ప్రాంతాల ప్రజలు ఎవరూ ఆరుబయట నిద్రపోవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. సమీప ప్రాంతాలలో పంట పొలాల కోసం విద్యుత్ కంచెలు ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కానీ, పులి ఆచూకీ మాత్రం కనిపించలేదు. అయితే, మరో రెండు పులి కూనల జాడ మాత్రం కెమెరాలలో రికార్డ్ అయింది. ఈ రెండు కూనలు ఆ ఆడపులి బిడ్డలు కాగా తల్లి పులి కోసం పిల్లలు తిరుగుతున్నట్లు అధికారులు భావించారు.
దీంతో ఆ ఆడపులి ఏమైంది?.. ఎటు వైపు వెళ్లిందని రకరకాలుగా సెర్చ్ చేస్తున్న అధికారులకు స్థానిక గ్రామాలలో జరుగుతున్న చర్చ ఒకటి చెవిన పడింది. అధికారులు పులి జాడ కోసం ఒకవైపు వెతుకుతుండగా.. పులి అప్పటికే చనిపోయినట్లు తెలుస్తుంది. పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి మరణించగా.. అది గమనించిన కొందరు పులి మాంసాన్ని వండుకుని తినేసినట్టు ప్రచారం జరుగుతోంది.
పులి చర్మాన్ని సమీపంలోని పాడుబడిన బావిలో పడేసినట్టు అనుమానిస్తుండగా.. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో విషయం బయటపడింది. అది అలా అలా స్థానిక గ్రామాలకు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమై విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. పులి మాంసాన్ని వండుకుని తిన్నట్టుగా భావిస్తున్న 12 మందిని గుర్తించిన అధికారులు.. మూడు రోజుల క్రితం వీరిలో ఇద్దరిని ఎర్రగొండపాలెంలోని కార్యాలయానికి పిలిపించి రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది.