ugadi-Srisailam: శ్రీశైలంలో ఉగాది సంబరాలు… మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

అపారమైన భక్తికి వీరశైవుల విన్యాసాలు అత్యంత ప్రసిద్ధి పొందాయి.. అగ్నిగుండ ప్రవేశం, ఒళ్లు గగ్గుర్లు పొడిచేలా అర్ధరాత్రి వరకు శ్రీశైలంలో సాగిన వీరాచార విన్యాసాలు మల్లన్న భక్తులను ఆకట్టుకున్నాయి. వీరశైవుల శరీరాలపై ఇనుప సువ్వలతో గుచ్చుకుని శివయ్యపై భక్తిని చాటుకున్నారు. వీరశైవుల విన్యాసాలు తిలకించిన లక్షలాదిమంది భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంత ఎక్కడో కాదు సాక్ష్యాత్తు ఆ పరమశివుని సన్నిధి లోని శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సందర్భంగా చోటు చేసుకున్నాయి. కన్నడ భక్తులు తమ శరీర భాగాలపై ఇనుప చువ్వలతో గుచ్చుకుని వారి భక్తి ప్రపత్తిని చాటుకున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో ఉగాది మహోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఉగాది పర్వదినానికి ముందు రోజు రాత్రి వీరశైవుల అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఉగాది ఉత్సవాల్లో ప్రధానమైన ఘట్టం అగ్ని గుండం.. తమ ఆడపడుచుగా ఆరాదించే భ్రమరాంబికాదేవి సన్నిధిలో కన్నడిగులు సర్వపాపాలు హరించాలన్న సంకల్పంతో మంగళవారం అమావాస్యనాడు రాత్రి అగ్నిగుండ ప్రవేశం చేశారు.
ఎంతో ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో ముందుగా అగ్ని గుండానికి ఆలయ అర్చకులు, ఈవో లవన్న దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వీరశైవులు తమ విన్యాసాలు ప్రదర్శించారు. రాత్రి 11 గంటలకు శివ దీక్షా శిభిరాల్లో శరీర భాగాల్లో, నోటిలో బుగ్గల్లో ఇనుప సువ్వలతొ గుచ్చుకుంటూ హరహర మహాదేవా అంటూ ఆ మల్లికార్జునస్వామికి వేడుకుకున్నారు. నుదిటిపై కనుబొమ్మలపై చేతులపై సైతం గుచ్చుకుంటు వళ్లుగగ్గుర్లు పొడిచేలా కన్నడిగులు భక్తి తన్మయంతో చేసిన నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.