Vaishnodevi Temple: మహాభారతంలో ప్రస్తావించబడిన వైష్ణోదేవి దేవాలయం గురించి ఈ విషయాలు తెల్సుకున్నారా…?

జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడిన పర్వతసమూహం ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదంలో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడింది. మరి ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఇపుడు తెలుసుకుందాం.
వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది. కురుపాండవ సంగ్రామంనకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి, ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతం చెపుతోంది. “జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే” అనే శ్లోకం ఆధారంతో ఈ దేవస్థానంలోనే అర్జునుడు పూజలు చేసాడని తెలుస్తుంది.
ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన కారణంగా కొన్ని సంప్రదాయాల శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠానికి అత్యంత శక్తివంతమైందిగా భావిస్తారు. కొన్ని సంప్రదాయంల వారు మాత్రం అమ్మవారి కుడిచేయి ఇక్కడ పడిందని భావిస్తారు. హైందవ పవిత్ర పుస్తకాల మూలముగా తెలియవచ్చేది ఏమనగా, కశ్మీరంలో అమ్మవారి కుడిచేయి పడిందని. ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయంలో మనిషి కుడి చేయి రూపములోని కొన్ని శిల్పాలు లభ్యం కావడం ఈ వాదన సరైనదేననడానికి ఊతమిస్తుంది. ఈ చేతి శిల్పంను అమ్మవారి వరద హస్తంగా భక్తులు గౌరవిస్తారు.