Alluri District: రోడ్డు లేని తండా.. బైకుపైనే నిండు గర్భిణీ ప్రయాణం.. మార్గమధ్యలో అడవిలోనే ప్రసవం!

Alluri District: మారోమూల అటవీ ప్రాంతాల్లో ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికారులలో ఎలాంటి చలనం లేదు. సకాలంలో వైద్యం అందక గర్భిణీలకు తల్లిబిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా.. అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పాపం ఆ అమాయక గిరిజనుల తలరాతలు ఎన్నటికీ మారడం లేదు. మా గ్రామానికి రోడ్డు మార్గం కల్పించండి మహాప్రభో అంటూ వేడుకున్నా.. అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గిరిజన తండాలలో ఎవరికైనా రోగమొస్తే వాళ్ళని మంచాలపై మోసుకొని ఆసుపత్రులకు వెళ్లాల్సిందే.
అదే గర్భిణీ స్త్రీలు అయితే ప్రసవ వేదనతోనే డోలీలలో మోసుకెళ్లి ఆసుపత్రులకు చేరుస్తారు. ఈక్రమంలో అడవిలోనే ప్రాణాలను కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అదృష్టం బాగుంటే అడవిలోనే ప్రసవిస్తారు. అలాగే తాజాగా, మరో గర్భిణీ ప్రసవ వేదనతో నడి అడవిలోనే ప్రసవించింది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పాలమామిడికి చెందిన గర్భిణీ దేవికి సోమవారం మధ్యాహ్నం తర్వాత పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.
అయితే, పాలమామిడి నుంచి మాడేబందకు కేవలం ద్విచక్ర వాహనం వెళ్లే మార్గం ఒక్కటే వాళ్ళకి దిక్కు. దీంతో తప్పదు కనుక అదే మార్గం గుండా గర్భిణీ స్త్రీ దేవిని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే గర్భిణీకి నొప్పులు మరింత ఎక్కువై అటవీ ప్రాంతం మధ్యలోనే పురుడు పోసుకుంది. అక్కడి నుంచి అతి కష్టం మీద అప్పుడే ప్రసవించిన తల్లిని బైకు మీద.. పుట్టిన బిడ్డను చేతుల్లో తీసుకొని మాడేబందకు చేరుకున్నారు.
మాడబంధ నుంచి తాజంగిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి, బిడ్డను అంబులెన్స్ లో తరలించారు. దేవికి ఇది రెండవ కాన్పు కాగా.. ఆమెకు పుట్టిన మగ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. కాగా, 150 మంది నివాసం ఉంటున్న పాలమామిడి నుంచి మాడిబంద వరకు రోడ్డు మార్గాన్ని వేయాలంటూ ప్రభుత్వానికి గిరిజన సంఘాలు ఎప్పటి నుండో డిమాండ్ చేశాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తప్పదని గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.