Bachula Arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత.. తీరని లోటని చంద్రబాబు విచారం!

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 09:02 PM

Bachula Arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత.. తీరని లోటని చంద్రబాబు విచారం!

Bachula Arjunudu: తెలుగుదేశం పార్టీలో మరో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తుది శ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు మరణంతో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పార్టీ నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆయన గత జనవరి 28న గుండెపోటుకు గురవగా అప్పటి నుంచి విజయవాడ రమేశ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడారు. ఆయనకు వైద్యులు స్టెంట్ అమర్చారు. అయితే, రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన పరిస్థితి విషమించినట్టు భావిస్తున్నారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

బచ్చుల అర్జునుడు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. బచ్చుల అర్జునుడు స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం కాగా, ఆయన బందరు మున్సిపల్ చైర్మన్ గా ప్రస్థానం ఆరంభించారు. 2014లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

బచ్చుల అర్జునుడు మరణంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు. ఆయన కోలుకుంటారని భావించామని తెలిపారు. అర్జునుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బచ్చుల మృతి చెందిన సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. నిజాయతీకి మారుపేరు, అజాతశత్రువు అయిన అర్జునుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని లోకేశ్ కొనియాడారు.