Street Dogs: చిన్నారులపై వీధి కుక్కల దాడి.. బెజవాడను వణికిస్తున్న శునకాలు..!

Street Dogs: హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన అందరినీ కదిలించిన సంగతి తెలిసిందే. భాగ్యనగరంలో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి ప్రాణాలు తోడేసిన దుర్ఘటన ఎందరినో నిర్ఘాంత పరచింది. అడవిలో జంతువును వేటాడినట్లు ఆకలిగొన్న అయిదు కుక్కలు అన్ని వైపులనుంచీ దాడికి తెగబడటంతో తీవ్రంగా గాయాలపాలైన చిన్నారి కడకు నిస్సహాయంగా కన్ను మూశాడు.
ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు- వీధికుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని సూటిగా ప్రశ్నించింది. అయితే, నిజానికిది, దేశంలో ఏ ఒక్క ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితమైన సమస్య కాదు. ఇటీవలే బిహార్లో ఓ వీధికుక్క ఒక్క రోజునే 70మందిని కరిచి బీభత్సం సృష్టించింది. ఆమధ్య బెంగళూరు శివార్లలో డెబ్భై ఏళ్ల వృద్ధురాలిని శునకాలు గొంతు కొరికి చంపేసి మృతదేహాన్ని లాక్కుపోయి పీక్కుతిన్నాయి.
ఆ ఘటనలు మరువకముందే రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధి కుక్క ఎత్తుకెళ్లి కొరికి చంపేసింది. ఈ దుర్ఘటనల తర్వాత పిల్లలను భయటకు పంపేందుకు కూడా తల్లిదండ్రులు జంకుతున్నారు. కాగా, తెలంగాణలోనే కాదు పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రం ఏపీలోనూ కుక్కల బెడద ఎక్కువగానే వుంది.
విజయవాడ నగరంలో ఈ వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా భవానిపురంలో నజీర్, జెస్సికా, చైతన్య అనే ముగ్గురు చిన్నారులు కుక్కకాటుకు గురయ్యారు. నలుగురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, రోజురోజుకు కుక్కల దాడి ఘటనలు పెరిగిపోవడంతో విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.