Kakinada: గత ఏడాది యువతిని చంపిన ప్రేమోన్మాది.. నేడు సెషన్స్ సంచలన తీర్పు!

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 04:33 PM

Kakinada: గత ఏడాది యువతిని చంపిన ప్రేమోన్మాది.. నేడు సెషన్స్ సంచలన తీర్పు!

Kakinada: గత ఏడాది కాకినాడలో ప్రేమోన్మాది దేవికా అనే యువతిని దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడికి తాజాగా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల సమీపంలో తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో గత ఏడాది అక్టోబర్ లో గుబ్బల వెంకటసూర్యనారాయణ అనే యువకుడు పట్టపగలు దేవికా అనే యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు.

కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరానికి చెందిన కాదా రాంబాబు కుమార్తె దేవిక(21) కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ కొప్పిశెట్టి చంద్రమ్మ ఇంట్లో ఉంటూ కాకినాడ పీఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల వెంకటసూర్యనారాయణ కూరాడలోని మేనమామ ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ దేవిక ప్రేమించాలని వేధించాడు. ఈ విషయంలో పెద్దలు కూడా యువకుడిని మందలించారు.

ఒకరోజు ఉదయం దేవిక కరపకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా మధ్యలోనే మాటువేసిన వెంకటసూర్యనారాయణ.. తన బ్యాగ్‌లోంచి కత్తి తీసి దేవికను అత్యంత కిరాతకంగా నరికివేశాడు. ఆ రోడ్డు పరిసర పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలు వచ్చి నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న దేవికను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఆమె శరీరంపై 48 కత్తి పోట్లున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా, అప్పటి నుండి సుదీర్ఘంగా విచారణ జరిపిన కాకినాడ జిల్లా మూడవ అదనపు సెషన్స్ కోర్టు తాజాగా నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఐదు వేలు జరిమానా కూడా విధించింది. కోర్టు తీర్పుతో దేవిక కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల అర్థిక సాయం అందించింది. నిందితుడికి శిక్ష పడడంతో ఈ అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.