Medico Preethi: ప్రీతి మృతిపై ఏబీవీపీ ఆందోళన.. కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సైఫ్‌ ఉరి డిమాండ్!

Kaburulu

Kaburulu Desk

February 27, 2023 | 12:28 PM

Medico Preethi: ప్రీతి మృతిపై ఏబీవీపీ ఆందోళన.. కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సైఫ్‌ ఉరి డిమాండ్!

Medico Preethi: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల అనస్తీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్ను మూసిన సంగతి తెలిసిందే. సీనియర్ల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ప్రీతిని కాపాడడం కోసం ప్రత్యేక వైద్య బృందం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో ఫలితం లేకపోయింది. ప్రీతీ మృతితో ఆదివారం రాత్రి నిమ్స్ హాస్పటల్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది.

కాగా, ప్రీతి మృతికి నిరసనగా ఏబీవీపీ విద్యార్థులు కేఎంసీ వద్ద ఆందోళనకు దిగారు. ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని ఉరితీయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే కేఎంసీ వద్దకు భారీగా చేరుకున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు మెడికో ప్రీతి మృతికి నిరసనగా తెలంగాణ ఏబీవీపీ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. మెడికో మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమెను వేధించిన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. హెచ్ఓడీ, ప్రిన్సి పల్‌ని కూడా సస్పెండ్ చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తరచూ వెలుగులోకి వస్తున్న ర్యాగింగ్ సంస్కృతిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

ఇక, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టమ్ అనంతరం ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు. ప్రీతి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా.. గిర్ని తండాలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారమే ప్రీతి అంత్యక్రియలను నిర్వహించనుండగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రీతి స్వస్థలం గిర్ని తండాలో భారీగా పోలీసులను మోహరించారు.