Nagarjuna Konda: బౌద్ధ తాత్వికుడు నాగార్జుని పేర వెలసిన నాగార్జున కొండ విశిష్టత తెలుసా…?

సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడి పేర వెలసినది నాగార్జున కొండ. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన, సా.శ.పూ. 2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఈ ద్వీపపు ప్రదర్శనశాల ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
ఇక్ష్వాకులు ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు. వీరిలో వాసిష్ఠీపుత్ర శ్రీఛాంతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతంలో “విజయపురి” అనే పేరుతో నగరాన్ని నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. నలుగురు ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీఛాంతమూలుడు అశ్వమేధ యాగం చేశాడు. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం – విజయపురి సా.శ. 200 నుండి 300 వరకు మహోజ్వలంగా విలసిల్లింది.
పురాతత్వ శాసనాల వలన ఆంధ్ర ఇక్ష్వాకు రాజులు విరాపురుసదత్త, ఏహువుల వారి కుటుంబసభ్యులు బౌద్ధమతాన్ని ఆదరించారని తెలుస్తున్నది. దేవాలయాలు, విహారాలను ఇక్ష్వాకు రాణులు ప్రత్యేకంగా కాంతిశ్రీ 10సంవత్సరాలపాటు భవనాన్ని స్థూపాన్ని కట్టించారనటానికి శాసనాలున్నాయి. రాచరికకుటుంబాలేకాక ఇతర ధనిక సభ్యులు కూడా దానంచేసినట్లు శాసనాలలో ఉంది. ఉత్కృష్ట స్థితిలో 30 విహారాలతో దక్షిణభారతదేశంలో అతిపెద్ద బౌద్ధమత కేంద్రంగా విరాజిల్లింది.