YSRCP: ఇంటింటికీ వైసీపీ నేతలు.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ మరో కొత్త కార్యక్రమం

YSRCP: ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అంటే.. ఏడాది తర్వాత కదా ఈ ప్రశ్న అడగాల్సింది అని సమాధానం వస్తుంది. కానీ.. రాజకీయాలు చూస్తే రేపే ఎన్నికలు అనేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేత నారా లోకేష్ 400 వందల రోజులు 4 వేల కిమీ పాదయాత్ర మొదలు పెట్టగా.. త్వరలోనే తన వారాహీ వేసుకొని పవన్ కళ్యాణ్ యాత్ర మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి ప్రతిపక్షాలే ప్రజలలోకి వెళ్తుంటే.. మనం ఎందుకు ఊరికే ఉండాలని అధికార వైసీపీ కూడా గడపగడపకి వెళ్లే కార్యక్రమం మొదలు పెట్టారు.
వైసీపీ తలపెట్టిన గడపగడపకి కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో.. ఎంత ఫలితం వచ్చిందో తెలియదు కానీ.. వైసీపీ ఇప్పుడు మరో కార్యక్రమం మొదలు పెట్టేందుకు సిద్దమవుతుంది. ప్రతి ఇంట్లో జగన్ పేరు వినిపించేలా ఈ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది. ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరిట తయారు చేసిన స్టిక్కర్లను ప్రతి ఇంటికి అతికించాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. తన విశ్వసనీయతను గుర్తుకు తెచ్చేలా ఈ కొత్త స్లోగన్ రూపొందించడం గమనార్హం.
ఒక విధంగా వైసీపీ ప్రజలలో ఎమోషనల్ బాండింగ్ డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్సీపీ ధీమాగా చెబుతుంది. దీంతో తమ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్క ఇంట్లో ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను అతికించే ప్రక్రియను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఈ కార్యక్రమం సూచనప్రాయంగా మొదలు పెట్టగా త్వరలో ఇది రాష్ట్రవ్యాప్తం చేయనున్నారు.
గతంలో 2019 ఎన్నికలలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదం ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. అచ్చంగా అలాగే ఇప్పుడు ‘మా నమ్మకం నువ్వే’ అంటూ జనాలను తమవైపు తిప్పుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఒకరకంగా అధికార పార్టీ వ్యూహకర్తలు ప్రజలలో లబ్ది దారులకు పొందిన సాయాన్ని గుర్తుచేసేలా ఎమోషనల్ టచ్ ఇస్తూ ఈ నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.