Air India flight: ప్రారంభించిన మొదటి రోజే.. ప్రయాణీకులను వదిలేసి వెళ్లిన విమానం.. గన్నవరంలో గోల గోల!

Air India flight: గన్నవరం విమానాశ్రయం ఎదుట కువైట్ వెళ్లాల్సిన 18 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కువైట్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం తమను వదిలేసి వెళ్లిందని ఇరవై మంది ప్రయాణికులు ఆరోపించారు. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది మాత్రం మీరే ఆలస్యంగా వచ్చారని.. విమానం కరెక్ట్ టైంకి వెళ్లిపోయిందని వారిని అడ్డుకున్నారు. ప్రయాణికుల ఆందోళనతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా కువైట్ సమ్మర్ ఎయిర్ ఇండియా సర్వీసెస్ ను బుధవారం ప్రారంభించారు. అయితే మొదటి రోజునే ఈ విమానం ప్రయాణీకులను వదిలేసి, వెళ్లిపోవడంతో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాదాపు 18 మంది ప్రయాణికులు విమానం మిస్ అవ్వడంతో విమానాశ్రయంలో గందరగోళం చెలరేగింది.
ఎయిరిండియా కువైట్ విమానం షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం గం.9.55 నిమిషాలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం రెండున్నర గంటలకు కువైట్ చేరుకుంటుంది. ఆ తర్వాత కువైట్ లో మళ్ళీ సాయంత్రం గం.3.40 నిమిషాలకు బయలుదేరి, రాత్రి గం.8.35కు గన్నవరం చేరుకుంటుంది. అయితే, బుధవారం గన్నవరం నుండి ప్రారంభమైన విమానం కొందరు ప్రయాణీకులను తీసుకొని వెళ్లలేదు. విమానం గం.9.55కు బయలుదేరనుండగా.. వారికి ఇచ్చిన టిక్కెట్లలో మధ్యాహ్నం గం.1.10 అని ఉంది.
ఈ కారణంగా గన్నవరం నుండి కువైట్ కు 85 మంది ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకోగా, 67 మంది మాత్రమే వెళ్లారు. టిక్కెట్ పైన తప్పుగా ముద్రించడంతో 18 మంది ఆలస్యంగా వచ్చారు. డబ్బులు రీఫండ్ చేస్తామని సిబ్బంది చెప్పడంతో ఎయిరిండియా సిబ్బందితో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. విమానం 9.55కి బయలుదేరుతుందని తాము మెసేజ్ పెట్టామని సిబ్బంది చెబుతుండగా, అలాంటిదేమీ రాలేదని ప్రయాణీకులు అంటున్నారు. కాగా, ఈ సమ్మర్ ఎయిరిండియా సర్వీస్ ను నేటి నుండి అక్టోబర్ వరకు నడపనున్నారు.