Nellore City: ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డుగా అనిల్ కుమార్ యాదవ్ కటౌట్‌.. కాపలాగా ఓ సీఐ, 15 మంది పోలీసులు!

Kaburulu

Kaburulu Desk

March 27, 2023 | 03:46 PM

Nellore City: ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డుగా అనిల్ కుమార్ యాదవ్ కటౌట్‌.. కాపలాగా ఓ సీఐ, 15 మంది పోలీసులు!

Nellore City: నెల్లూరు జిల్లాలో ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా అసంతృప్తులను బుజ్జగించే పని కన్నా.. వారిపై చర్యలు తీసుకొనేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంది. నెల్లూరు జిల్లాలోనే తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేపై వైసీపీ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు మరికాస్త జాగ్రత్తగా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి.

కానీ, నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తన రూటే సపరేటు అంటున్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా.. నర్తకీ కూడలిలో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే పెద్ద సమస్య లేదు కానీ.. ఆ ఫ్లెక్షీని అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా చేసేలా ఏర్పాటు చేశారు. ఒకవిధంగా ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా అనిల్ కుమార్ ఫ్లెక్షీ పెట్టారు.

అయితే, ఎన్టీఆర్ విగ్రహానికి అనిల్ కుమార్ యాదవ్ కటౌట్ అడ్డుగా ఉందని, దాన్ని తొలగించాలని టీడీపీ నగర ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నగరపాలక సంస్థ అధికారులను కోరారు. నగరపాలక సంస్థ అధికారులలో ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు, తాజాగా టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం నర్తకి సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు వచ్చారు. అయితే, ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా అనిల్ కుమార్ కటౌట్ కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే ఎవరైనా అనిల్ ఫ్లెక్సీ తొలగిస్తారనే అనుమానంతో పోలీసులు పహారా కాశారు. అది కూడా ఒకరిద్దరు కాదు.. ఏకంగా 15 మంది పోలీసులు కాపాల కాశారు. వీరులో ఓ సీఐ కూడా ఉండటం విశేషం. దీంతో.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై పోలీసుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు కానీ.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.