Yuvagalam Yatra: లోకేశ్ పాదయాత్రలో నారా రోహిత్.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

March 25, 2023 | 06:05 PM

Yuvagalam Yatra: లోకేశ్ పాదయాత్రలో నారా రోహిత్.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు!

Yuvagalam Yatra: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు?. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుండి ఆ పార్టీ ముఖ్య నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు ఇలా ఎవరు మీడియా కంట పడినా ఎదురయ్యే ప్రశ్న ఇదే. జూనియర్ రాకకోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీని ఆయన పరిధిలోకి తీసుకోవాలని ఆశించేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు.

కాగా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే విషయమై నటుడు నారా రోహిత్ స్పందించారు. టిడిపి యువనేత నారా లోకేష్‌ ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజులు యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ శనివారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గంలో ఒనుకువారిపల్లి నుంచి 50వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు నారా రోహిత్ నారా లోకేష్‌తో కలిసి కొంతదూరం పాదయాత్ర చేసి సంఘీభావం తెలిపారు.

దారిలో ప్రజలతో మాట్లాడుతూ, రాజకీయాలలోకి యువత రావాలని కోరుకొంటున్నానని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలిందని, ఆ పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడిందని అన్నారు. అనంతరం ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “అవసరమైతే జూ.ఎన్టీఆర్‌ కూడా రాజకీయాలలోకి వస్తారు,” అని చెప్పడంతో టిడిపి కార్యకర్తలు హుషారుగా ఈలలు వేసి తమ ఆనందం తెలియజేశారు. దీంతో నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, నారా లోకేష్‌ ఈ 50 రోజుల పాదయాత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే బ్రేక్ తీసుకొన్నారు. మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రెండు రోజులు, మళ్ళీ ఉగాది పండుగకు మూడు రోజులు బ్రేక్ తీసుకొన్నారు. ఈ 50 రోజులలో నారా లోకేష్‌ ఇప్పటివరకు 625 కిమీ పాదయాత్ర పూర్తిచేశారు. ఈ యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్‌ రాయలసీమ జిల్లాలలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారు.