Tirupati: భార్య ప్రియుడు చనిపోయాడని ప్రచారం చేసిన భర్తపై ప్రియుడు దాష్టికం.. కేసులో అసలు నిజాలివే!

Tirupati: తన భార్యతో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆధారాలతో సహా పట్టుకున్న భర్త తన భార్యని, ఆమె ప్రియుడిని ఏమీ చేయలేక.. భార్య ప్రియుడు, అతని స్నేహితుడు చనిపోయాడని RIP అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీంతో ఆగ్రహించిన భార్య ప్రియుడు, అతని స్నేహితుడి భర్తను కిడ్నాప్ చేసి.. అతనికి శిరోముండనం చేసి.. అతనిపై మూత్రం పోసి దారుణంగా హింసించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.
తిరుపతిలోని చంద్రగిరికి చెందిన వంశీ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే, అతని భార్యతో హర్షా రెడ్డి అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. హర్షారెడ్డి ఫైనాన్షియర్. కొన్ని కొన్ని సందర్భాలలో వంశీ కుటుంబంతో హర్షారెడ్డికి సంబంధం కలవగా .. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి కోపంతో
రగిలిపోయిన వంశీ.. ఆర్ధికంగా బలమైన హర్షారెడ్డిని ఏమీ చేయలేక సోషల్ మీడియాలో హర్షా రెడ్డి, అతని స్నేహితుడు అన్వర్లపై RIP అంటూ ప్రచారం చేశాడు.
ఈ పోస్టింగ్స్ చూసిన హర్షారెడ్డి, అన్వర్ వంశీపై కోపంతో రగిలిపోయారు. అనుకున్నదే తడవుగా వంశీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని.. బెంగళూరులో ఉన్న వంశీని కిడ్నాప్ చేసి చంద్రగిరికి తీసుకొచ్చారు. అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. అతనికి గుండు గీయించి.. వంశీపై మూత్రం పోశారు. అనంతరం వంశీని బెదిరించి అతనితో క్షమాపణ చెప్పిస్తూ వీడియో కూడా తీయించారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. హర్షా, అన్వర్లకు ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా సహకరించాడు. మొత్తంగా వంశీపై వీళ్ళు చేసిన అకృత్యాలు వీడియోల రూపంలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. బాధితుడికి అతని కుటుంబానికి పోలీసులు ధైర్యం చెప్పడంతో వంశీ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, నిందితులైన హర్షా, అన్వర్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు నడుస్తుంది.