Vetapalem: షాకింగ్ ఘటన.. ప్రైవేట్ క్లాసులని వేధిస్తున్నాడని టీచర్ను చెంపేందుకు విద్యార్థుల యత్నం!

Vetapalem: అసలే పరీక్షల సీజన్.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల టీచర్లు, లెక్చరర్లు తమ విద్యార్థులను వారి వారి తరగతులను సరిగ్గా చదివి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని శిక్షణ ఇచ్చే సమయం. ఒకవేళ ఉపాధ్యాయులు చెప్పినా విద్యార్థులు వినకపోతే దండించి వారిని దారిన పెట్టడం సహజం. అయితే, ఆ రోజులు ఎప్పుడో పోయాయనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. టీచర్లు ప్రైవేట్ క్లాసులని వేధిస్తున్నారని ఏకం విద్యార్థులు టీచర్లను హతమార్చాలని ప్లాన్ వేసిన ఘటన సంచలనంగా మారింది.
ఈ షాకింగ్ సంఘటన పూర్వ ప్రకాశం జిల్లా.. ప్రస్తుత బాపట్ల జిల్లా వేటపాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశాయిపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులను నిత్యం ప్రైవేట్ క్లాసులు తీసుకుంటూ వేధిస్తున్నారని, ఇది భరించలేని ఇద్దరు విద్యార్థులు ఉపాధ్యాయులను ఎలా కంట్రోల్ చేయాలని మిగతా విద్యార్థులతో చర్చించి ఒక ప్లాన్ వేశారు.
ఆ ఇద్దరూ మిగతా విద్యార్థుల నుండి కొంత డబ్బు సమకూర్చుకొని.. దాంతో రెండు కత్తులను కూడా కొనుగోలు చేసి, వాటిని వారి స్కూల్ బ్యాగ్ లలో స్కూల్ కి తీసుకొచ్చారు. సమయం చూసి ఆ ఉపాధ్యాయుల్ని తరగతి గదిలోనే నరికేయాలని ప్లాన్ చేశారు. అయితే, అదే క్లాస్ రూమ్ లోని ఓ విద్యార్థిని వారి మాటల్ని.. వారి ప్రవర్తనని గమనించి హెడ్ మాస్టర్ వద్దకు వెళ్లి తాను విన్న మాటల్ని, గమనించిన విషయాన్నీ, వారిపై ఉన్న అనుమానాన్ని వెల్లడించింది.
వెంటనే స్పందించిన హెడ్ మాస్టర్ హుటాహుటిన వెళ్లి అనుమానంగా ఉన్న వారితో మాట్లాడి వారి బ్యాగులను తనిఖీ చేయగా.. ఆ ఇద్దరి వద్ద రెండు పదునైన కత్తులు దొరికాయి. దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఖంగుతిన్నారు. హెడ్మాస్టర్ ఆ ఇద్దరు విద్యార్థులను తన రూమ్కు తీసుకెళ్లి ఎందుకిలా చేశారని ప్రశ్నించగా.. మీరూ, సైన్స్ మాస్టర్ తమను విసిగిస్తున్నారని.. మిమ్మల్ని చంపేద్దామని చెప్పడంతో ఆ హెడ్ మాస్టర్ ఖంగు తిన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేకపోగా.. ప్రస్తుతం వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.