Hanuman Chalisa – Ayodhya: అక్షర్ ధామ్ వేదికగా ‘శతకోటి హనుమాన్ చాలీసా’ ప్రచారం…!

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వేదికగా అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ సభలో వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం ఘనంగా ప్రారంభించారు. దేశం నైతిక, గుణ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాధికారత కోసం అక్షరధామ్ ఆలయ వేదికపై వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు అందరూ సమావేశమై శ్రీరామ మందిర స్థాపనకు ముందు వందలాది హనుమాన్ చాలీసా పఠించాలని తీర్మానించారు.
హనుమంతుని భక్తి స్ఫూర్తిని మేల్కొల్పాలని.. వాగ్యజ్ఞాన్ని భగవంతుని పాదాల చెంత అర్పించాలన్నారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠ వరకు ఇదే ఆచారంగా కొనసాగుతుందని చెప్పారు. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరామునిని ప్రతిష్టించే ఉత్సవం 2024, జనవరి 15న జరగనుంది. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ఏర్పాటు చేసిన భారీ సభలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని జనవరి 15, 2024 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి కలిగిస్తారని సభ నిర్వాహకులు ప్రకటించారు.
మార్చి 21, 2023 నుంచి జనవరి 15, 2024 వరకు 300 రోజుల పాటు గొప్ప భక్తి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు సభ నిర్వాహకులు. స్వామి నారాయణ అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సభ ద్వారా దేశ వ్యాప్తంగా సాంస్కృతిక చైతన్యాన్ని మేల్కొల్పేందుకు నాంది పలికారని పండితులు వ్యాఖ్యానించారు.