Vasantha Panchami celebrations in Basara: వసంత పంచమి వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగే తెలంగాణలోని పుణ్యక్షేత్రమేదో తెలుసా..!

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన సరస్వతి దేవి ఆలయం బాసర జ్ఞానసరస్వతి ఆలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం, బాసరలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదేనని చెప్పుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయంలో వసంత పంచమి వేడుకలు చాలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
సరస్వతి దేవి జన్మించిన రోజైన వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఐకే రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారు.
వసంత పంచమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తరలి వచ్చారు. అక్షరాభ్యాసం లేదా విద్యారంభం లేదా అక్షరారంభం అనేది ఒక సాంప్రదాయమైన కార్యక్రమం, ఆచారం. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుండి పిల్లలు అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు వచ్చే వసంతపంచమి నాడు జరుపుకుంటారు.