Gudivada: పోలీస్ vs రెవెన్యూగా మారిన కానిస్టేబుల్ వీఆర్ఓ మధ్య వివాదం.. ఏ మలుపు తిరుగుతుందో?

Gudiwada: ఒకటి సమాజంలో శాంతిభద్రతలకు కాపాడాల్సిన పోలీస్ విభాగం.. మరొకటి ప్రజా పాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ డిపార్ట్మెంట్. సాధారణంగా అయితే ఈ ఇద్దరూ ప్రజా వ్యవస్థలో అత్యంత కీలకం. ఉదాహరణగా చెప్పాలంటే.. ఒక గ్రామంలో ఎలాంటి వివాదం జరిగినా పోలీసులు ముందు రెవెన్యూ అధికారికి సమాచారమివ్వాలి. అలాగే, ఎలాంటి నేరం జరిగినా పోలీసుల సహకారంతోనే రెవెన్యూ ఉద్యోగులు దాన్ని విచారణ జరిపించాలి. అంతటి సమన్వయంతో ఉండాల్సిన ఈ విభాగాలు ఇప్పుడు తలపడుతున్నాయి.
నిజానికి ఇది ముందు ఒక కానిస్టేబుల్, ఒక వీర్వో మధ్య వివాదంగా మొదలై ఇప్పుడు ఏకంగా రెండు డిపార్ట్మెంట్స్ మధ్య వివాదంగా రాజుకుంది. పోలీస్ వర్సెస్ రెవిన్యూ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. వివరాలలోకి వెళ్తే.. సోమవారం విజయవాడలో అంగన్ వాడీ వర్కర్స్ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిరసనకు తన భార్యను పంపేందుకు రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు వీఆర్వో అనిల్. అయితే, నిరసనకు వెళ్తున్న అంగన్ వాడీ కార్యకర్త అయిన అనిల్ భార్యను అడ్డుకున్నారు లేడీ కానిస్టేబుల్ రమాదేవి.
భార్యను అడ్డుకోవడంతో లేడీ కానిస్టేబుల్ పై ఫైర్ అయ్యారు వీఆర్వో అనిల్. దీంతో వీఆర్వో అనిల్, లేడీ కానిస్టేబుల్ రమాదేవి పరస్పరం దాడులకు దిగారు. వివాదం మరింత రాజుకుంది. రెవెన్యూ ఉద్యోగులు గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఇటువైపు లేడీ కానిస్టేబుల్ తనపై దాడి చేశారనే ఫిర్యాదు మేరకు వీఆర్వో అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో అక్రమంగా అరెస్టు చేసిన వీఆర్వోను విడుదల చేయాలని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన మొదలు పెట్టారు. వీఆర్ఓపై దాడి చేసిన కానిస్టేబుల్ రమాదేవిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యో గులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. దీంతో ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందోనని ప్రభుత్వ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. కృష్ణాజిల్లాలో గన్నవరం వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆ వివాదం ఎంతటి సంచలనం కలిగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వివాదం కూడా సాధ్యమైనంత త్వరగా ముగించకపోతే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తోంది. మరి ఉన్నతాధికారులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.