Myanmar Military: ​మారణకాండ.. సైన్యం-తిరుగుబాటు దారుల మధ్య కాల్పులు.. 29 మంది మృతి!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 01:06 PM

Myanmar Military: ​మారణకాండ.. సైన్యం-తిరుగుబాటు దారుల మధ్య కాల్పులు.. 29 మంది మృతి!

Myanmar Military: మయన్మార్​లో మరోసారి మారణకాండ జరిగింది. మయన్మార్ సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు సన్యాసులు కూడా ఉన్నారు. దక్షిణ షాన్ రాష్ట్రంలోని ఓ ఆశ్రమంలో శనివారం రోజున సైన్యం మద్దతు గల జుంటాకు, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా ప్రపంచం దృష్టికి వచ్చింది.

శనివారం ఈ ఘటన జరిగినట్లు మయన్మార్ అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆదివారం సామాజిక మధ్యమాల్లో విడదలవగా అవి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. రక్తం మడుగులో మృతుల శరీరాలు పడి ఉన్నాయి. అందులో బుద్ధ సన్యాసులు కూడా ఉన్నారు. మఠం సైతం తూటాల రంధ్రాలతో నిండిపోయింది.

మార్చి నెల ప్రారంభంలో సాగింగ్ రీజియన్లోని మైన్ము టౌన్షిప్లో 17 మంది గ్రామస్థులను జుంటా దళాలు హత్య చేసినట్లు ఆరోపణలు రాగా.. తాజాగా ఈ కాల్పుల ఘటన జరిగింది. ఇప్పటి వరకు 22 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. మిగిలిన ఏడు మృతదేహాలు ఆశ్రమం వద్దే ఉన్నాయని.. వాటిని తీసుకువచ్చేందుకు వీలు కావట్లేదని మయన్మార్ అధికారులు తెలిపారు.

ఆశ్రమంలో ఈ మారణకాండకి ఉగ్రవాద గ్రూపులే కారణమని జూంటా ఆరోపించింది. జుంటాకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన తర్వాత మయన్మా ర్లో ఇప్పటి వరకు కనీసం 2,900 మంది దళాల చేతిలో చనిపోయారు. 17,500 మందికి పైగా అరెస్టయ్యారు. వీరిలో చాలా మంది ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలలో
పౌరులపై మయన్మార్ సైన్యం సామూహిక హత్యలు, వైమానిక దాడులు వంటి యుద్ధ నేరాలకు పాల్పడుతుందని తిరుగుబాటు దారులు పదేపదే ఆరోపిస్తున్నారు.