Karnatana Haveri: లంచం అడిగిన మున్సిపాలిటీ అధికారులు.. ఎద్దును ఆఫీసుకి తోలుకొచ్చిన రైతు

Karnatana Haveri: ప్రభుత్వ కార్యాలయాలలో చేయి తడపనిదే పనికాదు. ఎక్కడో ఒకరో ఇద్దరో మంచి అధికారులు ఉంటారేమో కానీ.. గవర్నమెంట్ ఆఫీస్ అంటే అమ్యామ్యాలు లేకుండా ఏ పనికాదన్నది జగమెరిగిన సత్యం. ఇది మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఇదే తంతు.. గ్రామా పంచాయతీ అధికారి నుండి సీఎంఓలో పనిచేసే ఉద్యోగుల వరకు లంచం లేనిది ఫైల్ కదిలించడం కష్టమే.
అయితే, ఈ లంచం ప్రభావంతో మిగతా వారి పరిస్థితి ఎలా ఉన్నా దేశంలో రైతులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అప్పుల ఊబిలో ఉండే అన్నదాతలకి.. ప్రతిచోటా ఈ లంచాల డిమాండ్ హడలెత్తిస్తుంటుంది. అందుకే కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కాగా, మరికొందరు ఆ అవినీతి అధికారుల భరతం పడుతుంటారు. కర్ణాటకలోని హవేరి జిల్లాలో కూడా ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపి లంచం అడిగిన అధికారికి దిమ్మతిరిగేలా చేశారు.
హవేరి జిల్లాలోని సవనూర్ మునిసిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు మునిసిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పని చేసి పెట్టేందుకు సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశాడు. మరో దారిలేక లంచం సమర్పించుకున్నప్పటికీ పని చేయకుండానే ఆ అధికారి బదిలీ అయ్యాడు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కొత్తగా వచ్చిన అధికారి కూడా పనిచేసి పెట్టేందుకు లంచం అడిగాడు.
ఆ రైతు అంతకుముందున్న అధికారికి సమర్పించుకున్నానని, ఆయన పనిచేయకుండానే బదిలీ అయ్యారని, తన వద్ద డబ్బుల్లేవని బతిమాలినా ఆఫీసర్ గారి మనసు కరగలేదు. పైసలిస్తేనే పని జరుగుతుందని కరాఖండీగా తేల్చి చెప్పేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతు ఎల్లప్ప తనకున్న ఎద్దుల్లో ఒకదానిని కార్యాలయానికి తీసుకొచ్చి డబ్బులకు బదులుగా ఎద్దును లంచంగా తీసుకోవాలని బతిమాలాడు. దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం కాస్తా ఉన్నతాధికారులకు తెలియడంతో లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎల్లప్ప పనిచేయాలని ఆదేశించారు.