Europe Latvia: తాగి బండి నడిపితే ఉక్రెయిన్ పంపిస్తారా.. ఇదెక్కడి విడ్డూరమైన శిక్ష స్వామి!

Europe Latvia: ఫుల్లుగా మద్యం తాగడం.. ఆ తర్వాత బండి ఎక్కి దిక్కు తెలియకుండా నడపడం.. ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ చేసి ఇక తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం.. అధికారులు, పోలీసులు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ఇందులో ఎలాంటి మార్పు ఉండడం లేదు. చాలా మంది ఇది మన ఇండియాలోనే మాత్రమేనేమో అనుకుంటారు. మన దగ్గర మాత్రమే ఏం ఖర్మ.. ప్రపంచం మొత్తం ఈ దరిద్రం ఉంది
అందుకే, కొన్ని దేశాలలో మందు బాబుల తిక్క ఎలాగైనా కుదర్చాలని చిత్ర, విచిత్రమైన శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. యూరప్ దేశంలోని లాత్వియాలో అలాంటి కొత్త రూల్ ఒకటి వచ్చింది. తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. డ్రైవర్ ను కిందకి దింపు కారు స్వాధీనం చేసుకుంటారు. ఆ వాహనాన్ని సరాసరి ఉక్రెయిన్ పంపిస్తున్నారు. ఇప్పటికే ఇలా స్వాధీనం చేసుకున్న 1200కుపైగా కార్లను ఉక్రెయిన్ సైన్యానికి అందించారు.
ఇక్కడ మందు కొట్టి కారు నడిపితే ముందుగా ఒకసారి జరిమానాతో వదిలేస్తున్నారు. రెండవసారి దొరికితే డ్రైవ్ చేసిన వారిని కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. కానీ, వాహనం మాత్రం సీజ్ చేస్తున్నారు. జరిమానా కడతాం మా కారు మాకు ఇవ్వండని అడిగితే, అది ఉక్రెయన్ ఆర్మీకి ఇచ్చేశాం అని చెబుతున్నారు. కొత్త రూల్ ప్రకారం.. వాహన చోదకులు రెండు నెలల వ్యవధిలో రక్తంలో ఆల్కహల్ పర్సెంటేజ్ 0.15 శాతం కన్నా ఎక్కువతో దొరికితే ఈ రూల్ అమలు చేస్తున్నారు.
జైడాట్ ఎన్వీ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో ఇక్కడ పోలీసులు సీజ్ చేసిన వాహనాలను ఉక్రెయిన్ ఆర్మీకి పంపిస్తున్నారు. ఆ దేశ ఆర్మీ వాటిని తమ యుద్ధ అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటోంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైన్యానికి చెందిన వేలాది వాహనాలు ధ్వంసమైన నేపథ్యంలో మందుబాబుల బండ్లు ఇలా వారికి సాయంగా పనికొస్తున్నాయి. కాగా, ఈ వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలని చుట్టేయడంతో కొందరు నెటిజన్లు ఇదెక్కడి శిక్షరా స్వామి అని నోరెళ్లబెడుతున్నారు.