Nagapur: యూట్యూబ్ చూసి సొంతంగా డెలివరీ చేసుకున్న 15 ఏళ్ల బాలిక.. పుట్టిన బిడ్డని గొంతు పిసికి!

Nagapur: టెక్నాలజీ మనిషి అభివృద్ధికి ఎంతగా ఉపయోగపడుతుందో.. అంతే మిస్ యూజ్ చేసి సమాజాన్ని నాశనం చేస్తుంది. ఓ బాలిక సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో శారీరకంగా కలిసి గర్భవతి కాగా.. ఇంట్లో తెలియకుండా గర్భాన్ని మేనేజ్ చేసి.. చివరికి సొంతంగా తానే యూట్యూబ్ చూసి డెలివరీ చేసుకొని.. పుట్టిన బిడ్డని గొంతుపిసికి చంపేసి ఓ పెట్టెలో పెట్టి ఇంట్లోనే దాచిపెట్టింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర నాగపూర్ లో జరిగింది.
పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. స్థానిక అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆపై అది క్రమంగా పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరవగా ఈ వ్యవహారం కొన్నాళ్ల పాటు సాగింది. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. ఇంట్లో చెప్పేందుకు బయటపడిన బాలిక గర్భం విషయాన్ని దాచిపెట్టింది. బాలికకి పొట్ట పెరుగుతుండడంతో అనుమానించిన బాలిక తల్లి ప్రశ్నించినా.. అనారోగ్యం కారణంగా అలా ఉందని తల్లిని బుకాయించింది.
ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నొప్పులు రావాలంటే ఏం చేయాలని యూట్యూబ్లో వీక్షించి.. అలాగే యూట్యూబ్ లోనే కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు తానే కాన్పు చేసుకొని.. ఓ ఆడబిడ్డకు బాలిక జన్మనిచ్చింది. అయితే, పుట్టిన వెంటనే ఆ శిశువును కిరాతకంగా గొంతు నులిమి చంపేసింది.
ఆ తర్వాత ఇంట్లోనే శిశువు మృతదేహాన్ని ఓ పెట్టెలో దాచిపెట్టింది. అయితే, డెలివరీ తర్వాత బాలిక నీరసంగా కనిపించడంతో తల్లి గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి చేరుకుని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. బాలికపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.