Naveen Murder Case: నవీన్ హత్యకేసులో ఊహించని సంచలన నిజాలు.. ప్రియురాలు నిహారికా అరెస్ట్!

Naveen Murder Case: సంచలనం సృష్టించిన హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు . ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. నవీన్ హత్యకు నిహారికాతో ప్రేమ వ్యవహారమే కారణం కాగా నిహారికాకి తెలిసే అన్నీ జరిగాయని చెప్పారు.
నవీన్ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హసన్కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికా, హాసన్ హత్య తర్వాత నవీన్ మృతదేహం ఉన్న ప్రాంతానికి వెళ్లారని.. అందుకే నిహారికతో పాటు హసన్ను రిమాండ్కు తరలించామని డీసీపీ వెల్లడించారు. అంతేకాదు, హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్ఫర్ చేసిందని.. నవీన్ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని డీసీపీ వెల్లడించారు.
నిహారిక ఫోన్ డేటాను డిలీట్ చేసి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్కు పాల్పడిందని.. ప్రస్తుతం నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు. హత్య అనంతరం హరిహర కృష్ణ మిత్రుడు హసన్ ఇంటికి వెళ్లి.. అతడికి వివరాలు చెప్పి.. నెత్తుటితో తడిసిన బట్టలు మార్చుకున్నాడని.. ఆ సమాచారం అతడు పోలీసులకు ఇవ్వలేదని.. దీంతో హసన్ను కూడా ఒక నిందితుడిగా చేర్చామని చెప్పారు పోలీసులు.
నేరం చేయడమే కాదు.. నేరాన్ని దాచి పెట్టడం కూడా నేరమేనని.. హత్య జరిగిన స్థలానికి వెళ్లి చూసిన ఈ ఇద్దరూ హత్య విషయాన్ని దాచిపెట్టారని.. హత్య అనంతరం నిందితుడికి సాయం కూడా చేశారని.. అందుకే వీరిద్దర్నీ కూడా నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో ఏ2గా యువతిని.. ఏ3గా హసన్ ను చేర్చారు.