Palnadu District: బస్సు దిగేందుకు ఆలస్యమవుతుందని వృద్ధురాలిని కిందకు తోసేసిన ఆర్టీసీ కండక్టర్!

Palnadu District: ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం.. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపబడును.. మీరు అడిగిన చోట బస్సు నిలపబడును.. ఆర్టీసీ బస్సు చక్రాలు.. ప్రగతి రథచక్రాలు. తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరికి ఇలాంటి కొటేషన్స్ బస్సులలో కనిపించే ఉంటాయి. అయితే, అలాంటి భద్రతా పరమైన ఆర్టీసీలో కూడా కొంతమంది క్రూరులు చేరి ఆ సంస్థ పరువు తీస్తున్నారు.
ప్రయాణికుల కోసం వారు పనిచేస్తారని, ప్రయాణికుల డబ్బులతో వాళ్ళకి జీతాలు వస్తున్నాయని తెలిసినా కొంతమంది కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా బస్సుల్లో వృద్దుల పట్ల కండెక్టర్లు అనుచితంగా ప్రవర్తించడం.. వారు బస్సు త్వరగా దిగాలని తొందరపెట్టడం లాంటివి చూస్తూనే ఉంటాం. ఈ కండక్టర్ వృద్ధురాలు బస్సు దిగడం ఆలస్యమవుతుందని ఏకంగా కిందకి తోసేశాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిల్లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
సత్తెనపల్లి డిపో వద్ద ఓ వృద్దురాలు బస్సులో నుంచి దిగుతున్న సమయంలో త్వరగా దిగాలి.. బస్సు వెళ్లాలి అంటూ కండక్టర్ తొందరపెట్టాడు. ఫుడ్ బోర్డ్ వద్దకు రాగానే వృద్ధురాలిని బస్సు నుంచి తోసేశాడు. దీంతో సదరు వృద్ధురాలు కిందపడిపోవడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. అంతేకాదు, వృద్దురాలి కింద పడిందన్న పాపం కూడా లేకుండా బస్సును ముందుకు తీసుకు వెళ్లాలని కండక్టర్ డ్రైవర్ కి సూచించాడు. కిందపడిన వృద్ధురాలికి గాయాలు కావడంతో తోటి ప్రయాణీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కండక్టర్ తీరుతో గాయాలపాలై వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి వృద్ధురాలిని తోసివేయడంపై తోటి ప్రయాణికులు భగ్గుమన్నారు. ఈ వ్యవహారంపై తోటి ప్రయాణికులు డిపోలోని అధికారులు, ఇతర ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే సదరు కండెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబందించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.