Jadala Ramalingeshwara Temple: భగవంతుడి చుట్టూ సర్పం ప్రదక్షణలు చేసే దేవాలయమేదో తెలుసా…?

నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో చెర్వుగట్టు గ్రామంలో ఒక అద్భుత ఆలయం వెలసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వలన ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన, కొండ దిగువున పార్వతీదేవి కొలువైవున్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ వుంటారు.
నాటి నుంచి నేటి వరకూ ఒక సర్పం స్వామివారికి ప్రదక్షిణలు చేసి వెళుతుండటం ఇక్కడి విశేషం. కొండ పై భాగాన ‘మూడు గుండ్లు’ గా పిలవబడే రాతి బండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తుంటాడు. ప్రతియేటా ఈ స్వామిచెంత మండల దీక్ష తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతోన్న వారికి స్వామివారి పాదుకలను తాకించడం ఆనవాయతీగా వస్తోంది.
పూర్వం హైహయ వంశ మూలపురుషుడు, కార్త వీర్జార్జున చక్రవర్తి సపరివారంగా వేటకోసం దండకారణ్యానికి బయలుదేరాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి, సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సాయంతో క్షణాలతో వేలాది సంఖ్యలలో ఉన్న రాజ పరివారానికి షడ్రసోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసాడు. అదే స్థలం ప్రస్తుతం మన చర్చించుకుంటున్న దేవాలయం.