Ambati Rambabu: వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా.. టికెట్ రూ.100.. మంత్రి అంబటిపై పోలీసులకు ఫిర్యాదు!

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 09:13 AM

Ambati Rambabu: వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా.. టికెట్ రూ.100.. మంత్రి అంబటిపై పోలీసులకు ఫిర్యాదు!

Ambati Rambabu: అదేంటో పాపం గతంలో ఏ ప్రభుత్వం మీద రాని ఆరోపణలు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వస్తున్నాయి. ఆ మధ్గ్య గుడివాడ క్యాసినోవా అందించారని పెద్ద ఎత్తున దుమారం చెలరేగగా.. అందుకు అప్పటి మంత్రే బాధ్యుడని కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పటి మంత్రి కొడాలి నానీ అనుచరులే ఈ క్యాసినోవా ఆడించారని ప్రచారం జరిగింది. చివరికి కొడాలి ఏమో జరిగి ఉండొచ్చు కానీ తనకేం సంబంధం లేదని చెప్పుకున్నారు.

కాగా, ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇప్పటి మరో మంత్రిపై కూడా ఇలాంటి అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు ఫోటోతో ముద్రించిన లక్కీ లాటరీ టికెట్లను సత్తెనపల్లి నియోజకవర్గంలో కొందరు అమ్ముతున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వంద రూపాయలు కట్టి లక్కీ లాటరీలో లక్ష రూపాయలు గెలుచుకోమంటూ వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులు మాత్రం జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఈ ఘటనపై జనసేన నేతల ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ లాటరీని నిర్వహిస్తుంది మంత్రి అంబటి అనుచరులేనని.. లాటరీ టికెట్లను కొనమని మంత్రి కూడా స్వయంగా ప్రజలకు చెప్తున్నారని కూడా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న లాటరీ టికెట్ల ప్రకారం చూస్తే ఈనెల 12 గురువారం అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు లక్కీ డ్రా నిర్వహిస్తామని ..లాటరీలో పేర్లు వచ్చిన వాళ్లకు ఆకర్షణీయమైన లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు. ఈ లాటరీకి వైఎస్ఆర్‌ సంక్రాంతి లాటరీ పేరు పెట్టడమే కాకుండా.. మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఫోటోలు ముద్రించి ఉన్నాయి.