Tigers Death: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో రెండు పులులు మరణం.. ముగ్గురు అరెస్ట్!

Kaburulu

Kaburulu Desk

March 26, 2023 | 10:50 AM

Tigers Death: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో రెండు పులులు మరణం.. ముగ్గురు అరెస్ట్!

Tigers Death: మన దేశంలో పలు రాష్ట్రాల్లోని అడవుల్లో పులుల సంచారం మళ్ళీ పుంజుకుంది. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే అవి పంట పొలాలలోకి, గ్రామాలలోకి, గూడెలలోకి వస్తున్నాయి. అయితే, స్థానిక ప్రజలు కొందరు పంట పొలాలకి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ తగిలి మరణించడంతో పాటు మరికొందరు అవగాహనా లోపంతో వేటాడి చంపేస్తున్నారు. ఇలాగే మరో రెండు పులులు బలయ్యాయి.

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో, తెలంగాణ మంచిర్యాల జిల్లాలో రెండు పులులు మరణించాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగంపేట శివారులో పాతిపెట్టిన పులి కళేబరాన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. పులి గోరు, ఎముకలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పులిని హత్య చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్య క్తులను అరెస్ట్ చేశారు. 2018-19 మధ్య కాలంలో విద్యుత్ వైర్లు తగిలి పులి మరణించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు.

రంగంపేట శివారులో చనిపోయిన పులి వయస్సు ఎంత.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ జరగుతోందని అటవీ శాఖ వెల్లడించింది. ఇక మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో మరో పులి మరణించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దొంగర్ గ్రామ శివారులో తాడోబా అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని అధికారులు గుర్తించారు. ఇది మగపులి కాగా, ఇది చనిపోయి 8, 9 రోజులు మాత్రమే అయిందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. పులి ఎలా మరణించిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, తెలంగాణల మధ్య పులుల సంచారం ఎక్కువ ఉంటుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోకి పులులు వస్తూపోతూ ఉన్నాయి. తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులులు కదలికలు పెరిగాయి. ఈ రెండు అభయారణ్యాల మధ్య పులులు ఓ కారిడార్ ను ఏర్పరుచుకున్నట్లు అటవీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతాలలోని ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.