Lift Accident: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. వైర్ తెగి ఊడి కిందపడిన లిఫ్ట్.. ముగ్గురు మృతి!

Lift Accident: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్లో తీవ్ర విషాదం జరిగింది. లిఫ్టు వైరు తెగి లిఫ్ట్ ఊడి కిందపడిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీటీపీఎస్ లోని ఫిఫ్త్ ఫేజ్లో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫిఫ్త్ ఫేజ్ లోకి వెళ్లేందుకు 8 మంది కార్మికులు లిఫ్ట్ ఎక్కగా.. కొంతదూరం పైకి వెళ్లిన తర్వాత ఆ లిఫ్ట్ వైర్ తెగి ఒక్కసారిగా ఊడి కిందపడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే చనిపోయారు. లిఫ్ట్ వైర్ తెగిన సమయంలో లోపల ఎనిమిది మంది ఉద్యోగులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మార్చి 18వ తేదీ శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. విధులకు హాజరైన ఉద్యోగులు, సిబ్బంది పై అంతస్తులకు లిఫ్ట్ లో వెళుతున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. లిఫ్ట్ ఓవర్ వెయిట్ కారణంగానే.. కొంతదూరం పైకి వెళ్లి కిందకు పడిపోయింది.
కాగా, వీటిపీఎస్ లోకి కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులను తప్ప ఇతరులు ఎవర్నీ అనుమతించటం లేదు. ప్రమాదం జరిగిందని తెలిసి మీడియా అక్కడకి వెళ్లినా.. మీడియాను కూడా లోపలికి రానివ్వటం లేదు. యాజమాన్యం కేవలం ప్రమాదం వార్తను మాత్రం బయటకు చెబుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో ఉన్న ఎనిమిది మందిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎనిమిది మందిలో ముగ్గురు ప్రమాదం జరిగిన చోటే చనిపోగా.. గాయపడిన మిగతా ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయని.. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన మృతులు జార్ఖండ్ కు చెందిన కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీటీపీఎస్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వలన ప్రమాదం జరిగిందని టీడీపీ, జనసేన నాయకులు బోర్డు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా.. వీటిపిఎస్, పవర్ మేక్ కంపెనీల అధికారులు బోర్డు హాస్పటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.