Summer 2023: మార్చిలోనే దంచికొడుతున్న ఎండలు.. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు?

Kaburulu

Kaburulu Desk

March 5, 2023 | 03:35 PM

Summer 2023: మార్చిలోనే దంచికొడుతున్న ఎండలు.. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు?

Summer 2023: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే, మార్చి నెల తొలి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండల్ని చూసి ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకే భయపడుతున్నారు. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఈ ఏడాది మార్చిలోనే ఎండలు ఇలా దంచి కొడుతుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయట అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. ఎండ వేడిమి తాళలేక ప్రజలు బయటకు రాకపోవడంతో రహదారులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎండ వేడి, ఉక్కపోతతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తుండడంతో విద్యుత్‌ వినియోగమూ పెరిగింది. తెలంగాణ ఇప్పటికే విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.

ఒక్క తెలంగాణలోనే తీసుకుంటే ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. మార్చి మొదటి వారానికి పెరిగిన ఉష్ణోగ్రతలు జనాన్ని అప్పుడే భయపెడుతున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఇలాగే కొనసాగితే నడి వేసవికి ఈ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది సరికొత్త ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది మార్చి నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా, ఈ ఏడాది అదే రోజు దాదాపు మూడు డిగ్రీలు అధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోనూ నిన్న 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాచలం జిల్లాల్లో ఉష్ణోగ్రత 21 డిగ్రీలు దాటింది. వేసవిలోకి అడుగుపెట్టీ పెట్టగానే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మున్ముందు ఎండలు ముదురుతాయని చెప్పడానికి సంకేతమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.