Honor killing: పరువు హత్య.. అతి కిరాతకంగా కుమార్తె తల, మొండెం వేరుచేసిన తండ్రి!

Honor killing: సమాజం అభివృద్ధిలో ఎంత ముందుకు వెళ్తున్నా కొందరు మనుషులలో మాత్రం మార్పు రావడం లేదు. సమాజం తనను ఏమంటుందో అని పరువు కోసం బ్రతికే వారిలో మార్పు మాత్రం రావడం లేదు. నలుగురు తనను ఏమంటారోనని ఆత్మహత్యలు చేసుకొనేవారు కొందరైతే.. తన పరువు తీశారని కడుపున పుట్టిన పిల్లలను అతి కిరాతకంగా చంపేసేవారు మరికొందరు. ఇలాంటి ఘటనే ఒకటి నంద్యాల జిల్లా పాణ్యం మండలం, ఆలమూరు గ్రామంలో చోటు చేసుకుంది.
తండ్రి దేవేంద్ర రెడ్డి కుమార్తె ప్రసన్నను అతి కిరాతకంగా తల, మొండెం వేరు చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలలోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పాణ్యం మండలం, ఆలమూరు గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి ప్రసన్నకి రెండేళ్ల క్రితం బనగానపల్లె మండలం, జిల్లెల్ల గ్రామానికి చెందిన వేరొక వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు ప్రసన్న మరో యువకుడిని ప్రేమించింది. పెళ్లి అయ్యాక కూడా అతడిని మర్చిపోలేకపోయింది.
ఈ క్రమంలో ఇటీవల గ్రామానికి వచ్చిన ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. దొంగచాటుగా పాత ప్రేమికుడిని కూడా కలుస్తుంది. దీనిపై దేవేంద్రరెడ్డి పలుమార్లు ప్రసన్నను మందలించగా ఆమె ప్రియుడిని వదలలేదు. తిరిగి భర్త దగ్గరకు వెళ్ళమని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో కుమార్తె ప్రవర్తనతో తన పరువు పోయిందని భావించిన తండ్రి ఆగ్రహంతో హత్య చేశాడు.
ఈ నెల 10న కుమార్తెను హత్యచేసిన తండ్రి దేవేంద్రరెడ్డి మరికొందరితో కలిసి కారులో కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి నంద్యాల-గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతంలో కుమార్తె మృతదేహం నుంచి తలను వేరు చేసి రెండింటిని వేర్వేరు చోట్ల పడేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికొచ్చాడు. అయితే, ఎప్పుడూ ఫోన్ చేసి పలకరించే మనవరాలు ఫోన్ చేయకపోవడంతో ఆమె తాత శివారెడ్డి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో శివారెడ్డి ఫిర్యాదు చేయడంతో దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రసన్న తల, మొండెం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.