China Population: ఎక్కువమంది పిల్లలను కనండి.. కాపురం చేసేందుకు నెల రోజుల సెలవులు!

Kaburulu

Kaburulu Desk

February 25, 2023 | 09:23 AM

China Population: ఎక్కువమంది పిల్లలను కనండి.. కాపురం చేసేందుకు నెల రోజుల సెలవులు!

China Population: దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు అన్నారు. అంతేకాదు.. వట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్‌ తలపెట్టవోయ్ అని కూడా ఆయనే చెప్పారు. ఈ మాటలు మన భారతీయులు ఎలా అర్ధం చేసుకున్నారో కానీ.. ఈ చైనా వాళ్ళు మాత్రం దేశమంటే మట్టి కాదు జనాభానే అని అర్ధం చేసుకున్నట్లున్నారు. అందుకే జనాభా మంత్రం జపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగివున్న దేశం చైనా కాగా.. ప్రస్తుతం చైనాలో 145 కోట్ల మంది జనాభా ఉంది.

అయితే ఇప్పుడు చైనా ప్రభుత్వానికి ఈ జనాభా సరిపోవడంలేదట. నిజానికి 1980 నుంచి 2015 వరకు అత్యంత కఠిన రీతిలో ఒక్కటే బిడ్డ విధానాన్ని అమలు చేశారు. దాంతో జనన రేటు భారీగా పడిపోయి దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగింది. అయితే ఇది చివరికి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే మార్పుగా పరిణమిస్తుందన్న నిపుణుల సూచనతో చైనా అప్రమత్తమైంది. ఇటీవల జనాభా రేటు తగ్గుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో దేశంలో మానవ వనరులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తోంది.

అందుకే, గతంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుండడంతో.. ఇద్దరు పిల్లలు వద్దు ఒక్కరే ముద్దు నినాదాన్ని తీసుకువచ్చిన చైనా ఇప్పుడా ఆ నినాదాన్ని మార్చేసి ఇద్దరు పిల్లలు వద్దు.. ఎక్కువ పిల్లలు ముద్దన్న నినాదాన్ని ఎత్తుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద సంఖ్యలో పిల్లలను కనేందుకు డ్రాగన్ కంట్రీ గేట్లు ఎత్తివేసింది. దీని కోసం కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రోత్సాహకంగా ఒక నెల రోజుల పాటు సెలవులు కూడా మంజూరు చేస్తోంది. ఈ ప్రత్యేక సెలవులో వేతనం కూడా ఇస్తారు.

తగ్గుతున్న జనాభా రేటుకి బ్రేకులేసి.. మళ్ళీ దేశవ్యాప్తంగా జనాభా రేటు పెంపొందించుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు ఇక్కడి చెబుతున్నారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా బర్త్ పాలసీలో సంస్కరణలు తెచ్చిన చైనా.. ఇక్కడ పెరిగిన వృద్ధుల లెక్కను.. సాధ్యమైనంత ఎక్కువమంది పిల్లలను కనేసి బ్యాలెన్స్ చేయాలని చూస్తుంది. మరి ఇది ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.