East Godavari TDP Leader: టీడీపీ నేత దారుణహత్య.. గొంతు నులిమి, తల గోడకేసి మోది చంపేశారు!

East Godavari TDP Leader: గోదావరి జిల్లాలలో టీడీపీ నేత, గ్రామ ఉప సర్పంచ్ దారుణ హత్య కలకలం రేపింది. మండువా లోగిళ్ల ఇంట్లో ఒంటరిగా ఉన్న టీడీపీ నేతపై దుండగులు దాడి చేసి గొంతు నులుమి తనను గోడకేసి మోది హత్య చేశారు. ఈ హత్య ఉమ్మడి గోదావరి జిల్లాల రాజకీయాలలో కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరులో ఈ దారుణ హత్య జరిగింది. టిడిపికి చెందిన ఉప సర్పంచ్ శివ ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు.
ఇంటిలో ఒంటరిగా ఉంటున్న శివప్రసాద్ ను అర్థరాత్రి దుండగులు హత్య చేశారు. తలపైన, మెడ మీద గాయాలు ఉండగా.. పీక నులిమి, తలను గోడకు వేసి కొట్టి చంపినట్లుగా ఉంది. దశాబ్దాల కాలంగా టీడీపీ నాయకుడిగా ఉన్న శివప్రసాద్ ప్రస్తుతం వేములూరు ఉప సర్పంచ్ గా ఉన్నారు. రాత్రి పదిన్నర గంటల వరకు అందరితో మాట్లాడి ఇంటిలోకి పడుకున్న శివ ప్రసాద్ తెల్లవారేసరికి మండువాలో రక్తపు మడుగులో శవమై ఉన్నారు. ఈ ఘటన చూసి స్థానిక టిడిపి నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొవ్వూరు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు హత్య జరిగిన ప్రదేశంలో ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన వేములూరులో కలకలం రేపుతుంది. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. శివప్రసాద్ కు భార్యా, కుమారుడు, కుమార్తె ఉండగా భార్య తల్లికి వంట్లో బాగోలేదని జంగారెడ్డిగూడెం వెళ్లగా.. కుమారుడు రాజమండ్రిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కుమార్తె ఏలూరులోని బిఫాంసి కాలేజీలో చదువుతుంది. ఈ క్రమంలోనే ఇంటిలో ఒంటరిగా ఉన్న శివప్రసాద్ ను దుండగులు పథకం ప్రకారమే హత్య చేసినట్లు కనిపిస్తుంది.