YSRTP: తెలంగాణలో రాష్ట్రపతి పాలన డిమాండ్.. అఖిలపక్షంతో రాష్ట్రపతి వద్దకు షర్మిల!

YSRTP: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేసి సీఎం కేసీఆర్ ఒక నియంతలా పాలిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్నదంతా గూండాలేనని, ప్రతిపక్షాలపై వారు దాడులు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. దేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంటే, తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరినట్లు షర్మిల చెప్పుకొచ్చారు. అన్ని వ్యవస్థలను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారని, ఎన్నికలు కూడా సజావుగా సాగుతాయనే నమ్మకం తనకు లేదని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదని.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
గవర్నర్ తో సమావేశం అనంతరం షర్మిల ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలో అఖిలపక్షంతో వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నట్లు షర్మిల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్రపతికి వివరించాలని ఆమె భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం అఖిలపక్షంగా ఏర్పడాలని తెలంగాణలోని అన్ని పార్టీలకు స్వయంగా ఆమె లేఖ రాయనున్నట్లు చెప్పారు. అఖిలపక్షంతో కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్లి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నట్లు చెప్పారు.
ఇక, ఏపీలో వైఎస్ వివేకా హత్యకేసు హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ తాజాగా.. ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా విచారించిన సంగతి తెలిసిందే. కాగా.. తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనా షర్మిల స్పందించారు. చిన్నాన్నను చంపిన వారు ఎవరైనా తగిన శిక్ష పడాల్సిందేనన్న షర్మిల.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని అన్నారు.