Varaha Laxminarasimha Temple: కప్ప స్తంభం గల దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..? ఆలయ విశేషాలు ఏమిటో తెలుసా…!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 10:50 PM

Varaha Laxminarasimha Temple: కప్ప స్తంభం గల దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..? ఆలయ విశేషాలు ఏమిటో తెలుసా…!

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు. స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు. అదే ఈ దేవాలయంగా ఇప్పటికీ పూజలందుకుంటుంది.

దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభంను కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.

సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కల్యాణం తరువాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది.