Kailasa Country: నిత్యానంద కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం.. సమావేశానికి హాజరైన ప్రతినిధి!

Kailasa Country: నిత్యానంద పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే రాసలీలల స్వామిగా మన దేశంలో ఆయనొక బ్రాండ్ అంబాసిడర్. అలాంటి నిత్యానంద మరోసారి వార్తల్లో హల్ చల్ చేస్తున్నారు. తనకు తానుగా సృష్టించుకున్న ‘కైలాస’ దేశం గురించి అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఈసారి ఏకంగా కైలాస దేశం నుండి ఇద్దరు ప్రతినిధులు తాజాగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సమావేశాల్లో పాల్గొన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కైలాస దేశం తరఫున సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులలో ఒక మహిళా తనను తాను విజయప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్నారు. మరొకరు ఈఎన్ కుమార్. ఐక్యరాజ్య సమితి సమావేశంలో విజయప్రియ నిత్యానంద మాట్లాడుతూ.. తమ గురువైన నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ సమావేశాల్లో తమ దేశం పేరును ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్కే)’గా పేర్కొన్నారు.
తమది హిందువుల కోసం ఏర్పాటైన తొలి సార్వభౌమ దేశం కైలాస అని ఆమె పేర్కొన్నారు. హిందూమతానికి చెందిన అత్యున్నత గురువు నిత్యానంద పరమశివం దీన్ని నెలకొల్పారని చెప్పారు. హిందూ మతానికి చెందిన సాంప్రదాయాలను, హిందూ నాగరికతను ఆయన పునరుద్ధరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం మరో ప్రతినిధి ఈఎన్ కుమార్ కూడా మాట్లాడారు.
ఐక్యరాజ్య సమితిలో వారు మాట్లాడినట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో యునైటెడ్ స్టేట్స్ ఆప్ కైలాసాకు విజయప్రియ శాశ్వత ప్రతినిధి హోదా ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. కానీ ఈ దేశాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందా లేదా అన్న విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, ప్రపంచ దేశాలన్నీ కామెడీగా చూసే నిత్యానంద కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం పంపడం.. దానికి కైలాస ప్రతినిధులు హాజరై ప్రసంగించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.