Rotating pillar in Temple:తిరిగే స్తంభం ఉన్న దేవాలయమేదో తెలుసా…?

భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు మన దేవాలయాలు. అటువంటి దేవాలయాలలో ఒకటే కర్ణాటకలో అతిపురాతమైన చరిత్ర ఉన్న బేలూరు దేవాలయం. యగాచి నది ఒడ్డున దక్షిణకాశీగా పేరు పొందిన బేలూరు పట్టణం హొయసల రాజులకు రాజధానిగా ఉండేది. ఎన్నో ప్రాచీనమైన, ప్రముఖ దేవాలయాలకు బేలూరు పట్టణం కేంద్రంగా నిలిచింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పట్టణంలో గల హొయసల రాజులు నిర్మించిన చెన్నకేశవ స్వామి దేవాలయంలోనే ఈ తిరిగే స్తంభం ఉంది. ఆనాటి రాజుల కళాపోషణకు దేవాలయం నిర్మాణం, శిల్పాల సౌందర్యం అత్యద్భుతంగా ఉంటుంది.
చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల రాజు విష్ణువర్ధనుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ దేవాలయ గాలిగోపురం కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఆలయం లో దర్పణ సుందరిగా ప్రసిద్ది పొందిన శిల్ప౦ ఇక్కడికి వచ్చిన భక్తులను ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మిక, ఖగోళ చిత్రాలను, నృత్య , గానాలు చేస్తున్న మదనికల చిత్రాలు ఇక్కడ ఉంటాయి.
బేలూరు ఆలయంలో అత్యంత ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా పేరు పొందిన గ్రావిటీ పిల్లర్ 42 అడుగుల ఎత్తుతో నిర్మించబడ్డ ఒక రాతి స్తంబం. ఈ స్తంభం దాని గురుత్వకేంద్రం ఆధారంగా మూడు వైపుల నిలబడి, నాలుగో వైపు నేలకు తాకకుండా చెక్కడం విజయనగర రాజుల పాలన లోని వాస్తుశిల్పుల సమర్థతకు, శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ స్థంభం అప్పట్లో దానంతట అదే రొటేట్ అయ్యే విధంగా అమర్చబడి వుండేదని, తర్వాత దానిని ఆర్కియాలజీవారు ఆపేయటం జరిగిందని చారిత్రాత్మక కథనం చెబుతోంది.