Himachal Pradesh Cow Cess: హిమాచల్ప్రదేశ్లో మందుబాబులకు మరోషాక్.. ఆవు పన్ను కట్టాల్సిందే!

Himachal Pradesh Cow Cess: దేశంలో అటు కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వరకు ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన వనరు ఏదైనా ఉందంటే.. ముందుగా ముక్తకంఠంతో చెప్పేది మద్యం. దీని మీద వచ్చే ఆదాయంతోనే దేశంలో ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేది. అందుకే దేశంలో ఎలాంటి ఆర్ధిక భారమైనా ముందు పెరిగేది లిక్కర్ ధరే.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలకు పన్నులతో పాటు మరెన్నో రకాలుగా మందు బాబులకు టాక్స్ విధించే ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో పన్ను కూడా మొదలు పెట్టింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ‘ఆవు పన్ను’(Cow Cess) వసూలు చేస్తామని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈమేరకు ఆయన ప్రకటన చేశారు. ఒక్కో మందు సీసాపై రూ. 10 చొప్పున గోవు పన్ను వసూలు చేసి, గోమాతల సంరక్షణకు వాడుతామని చెప్పారు.
ఇప్పటికే పంజాబ్లో విలాసవంతమైన వస్తువులపై ఈ పన్నును విధిస్తున్నారు. పంజాబ్ లో ఆవు పన్ను కింద కార్లపై 1,000, టూవీలర్లపై 500, విదేశీ మద్యంపై సీసాకు 10, రాష్ట్రంలో తయారయ్యే లిక్కరుకైతే సీసాకు 5 వసూలు చేస్తున్నారు. చండీగఢ్, రాజస్తాన్ లలోనూ ఈ బాదుడు ఉంది. ఉత్తరప్రదేశ్ లో పశు సంరక్షణ పేరుతో కేవలం 2 శాతం వాత పెడుతున్నారు. వందకోట్లతో గోశాలలను నిర్మించిన రాష్ట్రంగా యూపీ రికార్డుకెక్కింది. ఇక, ఇప్పుడు ఈ జాబితాలో హిమాచల్ కూడా చేరింది.
హిమాచల్ ప్రభుత్వం తీసుకున్న ఈ కౌ సెస్ ద్వారా సర్కారీ గల్లాపెట్టకు ఏడాదికి రూ.100 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పుకొచ్చారు. అన్ని బడ్జెట్లలో ఉన్నట్టే అన్ని వర్గాలకు కూడా ఆయన తాయిలాలు ప్రకటించారు. 20 వేల మంది బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు కోసం రూ.25,000 చొప్పు సబ్సిడీని అందిస్తామన్నారు. ఆడవాళ్లకు రూ.1500 నగదు బదిలీ ఇస్తామని.. దీని కోసం 416 కోట్లు ఖర్చువుతుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పడు రాష్ట్రానికి గత పాలకులు 10 వేల కోట్లు అప్పులు వారసత్వంగా ఇచ్చారంటూ చురకలంటించారు. ప్రస్తుతం తన ముందు రాష్ట్ర ఆర్థిక సవాళ్లున్నాయని తెలిపారు.