Importance of Mruthyunjay Mantra: మృత్యుంజయ మంత్ర ప్రాముఖ్యత ఏంటో తెలుసా…?
మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే “త్రయంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
“అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండు తొడిమ నుండి వేరుపడు విధముగా, మేము కూడా మరణము నుండి, మర్త్యత్వము నుండి విడుదల పొందాలి.” అనేది మృత్యుంజయ మంత్రము యొక్క ప్రాముఖ్యత. ఈ మంత్రమునకు ఋషి వశిష్ఠుడు. ఛందస్సు అనుష్టుప్. దేవుడు శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు). బీజము “హామ్”. శక్తి దేవి అమృతేశ్వరి. ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు.
చనిపోతామనే భయంతో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు. దీర్ఘరోగం తో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారినుంచి వారిని, దూరంచేస్తాడని ప్రజల విశ్వాసం. ఓం భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మ అనే అక్షరాల సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి అకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మ కారం పుట్టాయి. ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది.