Holi 2023: రంగులతో జరుపుకునే హోళీ పండుగ సాధారణమే… కానీ తేళ్లతో హోళీ పండుగ… ఎక్కడో తెలుసా…!

దేశ వ్యాప్తంగా హోళీ పండుగ సంబరాలు మిన్నంటాయి. విద్యా సంస్థల్లో, ఆఫీసుల్లో, ఆలయాల్లో, వివిధ సామాజిక ప్రదేశాల్లో, గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, వీధుల్లో ఎక్కడ చూసినా రంగు రంగుల ఆటలు కన్నుల విందు చేశాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రాదయాలకు అనుగుణంగా హొలీ పండుగను జరుపుకుంటున్నారు. రంగులు, బెలూన్స్ , లేదా కోడి గుడ్లు, టమాటా వంటివి వాటితో రంగుల కేళీ హోలీని ఆడుతారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం విషపూరితమైన తేళ్లతో హొలీ వేడుకను జరుపుకుంటారు. ఎక్కడో, ఆ విశేషాలేమిటో ఇపుడు తెలుసుకుందాం.
ఉతరప్రదేశ్ లో గల ఇటావా జిల్లాలో ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా తహసిల్ ప్రాంతంలోని సౌత్నా గ్రామంలో భైసన్ అనే శతాబ్దాల నాటి కోట ఉంది. ఈ కోటలో వేలాది ఇటుకలు, రాతి ముక్కలు పడి ఉన్నాయి. సాధారణంగా ఈ ఇటుకలను తీసినప్పుడు ఎటువంటి జంతువులు కనిపించవు. కానీ హోలీ పౌర్ణమి రెండవ రోజు సాయంత్రం కాగానే.. ఇటుకలు, రాళ్ల మధ్య నుండి వేలాది విషపూరితమైన తేళ్లు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో అక్కడకు గ్రామంలోని పెద్దలు, పిల్లలు చేరుకుంటారు. ఆ మట్టిదిబ్బ దగ్గరికి చేరుకుని.. పెద్దలు, పిల్లలు ఆ తేళ్లను తమ చేతుల్లోకి ఎత్తుకొని ఒకరిపై ఒకరు విసురుకుంటూ హోలీ ఆడతారు.
హోలీ పాట ప్రారంభమైన వెంటనే కోట లోపల నుండి తేళ్లు బయటకు రావడం ప్రారంభమవుతాయని, హోలీ రోజున తేళ్లు ఏ మనిషిని కాటేవని గ్రామంలో నివసించే ప్రజలు అంటున్నారు. పిల్లలు చేతుల్లో తేళ్లు పట్టుకుని తిరుగుతుంటారు.. ఆ తేళ్లు పిల్లలతో చాలా హాయిగా ఆడుకుంటాయి. ఈ గ్రామానికి చెందిన ప్రజలు.. ఈ తేళ్లను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఈ తేళ్లపై ఎవరూ దాడి చేయరు. అలాగే వాటిని చంపడానికి కూడా ప్రయత్నించరు. ఈ తేళ్లు పూర్తిగా సురక్షితం.. దీంతో గ్రామస్తులందరూ హొలీ రోజున ఆ తేళ్లను చేతులతో పట్టుకుని.. ఒకరిపై ఒకరు తేళ్లు విసురుకుంటూ హోలీని జరుపుకుంటారు.