IND vs NZ 2nd T20 Match : ఉత్కంఠ పోరులో కివీస్‌పై భారత్‌ జట్టు విజయం ..

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 11:37 PM

IND vs NZ 2nd T20 Match : ఉత్కంఠ పోరులో కివీస్‌పై భారత్‌ జట్టు విజయం ..

IND vs NZ 2nd T20 Match : ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టు నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి ఓవర్‌ వరకు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ శ్రమించారు. చివరి ఓవర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఫోర్‌ కొట్టడంతో భారత్‌ జట్టు కివీస్‌పై 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్‌ ఆదివారం లక్నోలో జరిగింది. తొలి టీ20 మ్యాచ్‌ విజయంతో ఆధిక్యంలో దూసుకెళ్లిన కివీస్‌ జట్టును.. రెండో టీ20 మ్యాచ్‌లో ఓడించి సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసింది.

IND vs NZ 1st T20 Match: తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం

రెండో టీ20 మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్‌ బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌ బాటపట్టించారు. కివీస్‌ బ్యాటర్లు బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశాన్ని బౌలర్లు ఇవ్వకుండా వరుస వికెట్లు తీయడంతో కివీస్‌ జట్టు 99 పరుగులకే ఆలౌట్‌ అయింది. కివీస్‌ జట్టులో సాంట్నర్‌ 19 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌ (11), కాన్వే (11), చాప్‌మన్‌ (14), గ్లెన్‌ ఫిలిప్‌ (5), డారిల్‌ మిచెల్‌ (8), ఎం బ్రేస్‌వెల్‌ (14), ఇష్‌ సోధి (1), లూకీ ఫెర్గుసన్‌ (0), జాకబ్‌ డఫీ (6 నాటౌట్‌) చొప్పున పరుగులు చేశారు. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా 18వ ఓవర్‌ వరకు బౌలింగ్‌ ఇవ్వలేదు. 18వ ఓవర్‌లో బౌలింగ్‌ వేసిన అర్ష్‌ దీప్‌ సింగ్‌ మూడు పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌ , దీపక్‌ హుడా, కుల్దిdప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు కివీస్‌ జట్టు 99 పరుగులు మాత్రమే చేసింది.

IND vs NZ 3rd ODI: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. మూడో వన్డేలోనూ భారత్‌ ఘన విజయం ..

కివీస్‌ నిర్దేశించిన 100 పరుగుల లక్ష్య చేధనకు టీమిండియా బ్యాటర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌(11), ఇషాన్‌ కిషన్‌ (19) మరోసారి విఫలమయ్యారు. దీంతో 10 ఓవర్లకు టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్‌ త్రిపాఠి(13), వాషింగ్టన్‌ సుందర్‌ (10) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ బాటపట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఆచితూచి ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు కదిలించారు. అయితే చివరి ఓవర్‌ వరకు విజయం భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య దోబూచులాడుతూ వచ్చింది. చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. టిక్నెర్‌ వేసిన 20వ ఓవర్లో మొదటి నాలుగు బంతులకు మూడు పరుగులే వచ్చాయి. దీంతో టీమిండియా ఓటమి ఖాయమనుకుంటున్న సమయంలో ఐదో బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ ఫోర్‌ కొట్టడంతో కివీస్‌పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (15) కీలక పరుగులు చేయగా, విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య కుమార్‌ యాదవ్‌కు (26) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కివీస్‌ జట్టులో మిచెల్‌ బ్రావెల్‌, సౌధీ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. మూడో టీ20 మ్యాచ్‌ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.