Rasaputra Rajini: దొంగనోట్ల కేసులో వైసీపీ మహిళా నేత.. నిజమని తేలితే చర్యలు తప్పవన్న ఎమ్మెల్యే!

Rasaputra Rajini: నకిలీ నోట్ల చలామణి కేసులో వైసీపీ మహిళా నేత రసపుత్ర రజినిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రసపుత్ర రజనితో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి మొత్తం రూ.44 లక్షల విలువైన రూ.500 దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రజనీ వైసీపీ మహిళా నేత కావడంతో ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది.
ఎవరీ రసపుత్ర రజనీ?
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజిని.. అధికార పార్టీ వైసీపీలో యాక్టివ్ గా వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా వ్యవహరించిన రజిని పదవీ కాలం ఇటీవలే పూర్తవగా మరోసారి రజినికి అదే పదవిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, అనూహ్యంగా ఆమె నుంచి రూ.44 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించారు. అనంతపురం పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి ఈ నకిలీ నోట్లు కొనుగోలు చేసి రజిని బెంగళూరులో వాటిని సర్క్యులేట్ చేస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేరును ప్రస్తావిస్తున్నారు.
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందన ఇదే..
రసపుత్ర రజనీ వైఎస్ఆర్సీపీకి చెందిన మనిషేనని స్పష్టం చేసిన ఎమ్మెల్యే.. దొంగనోట్ల చలామణి కేసులో రజనీ బెంగళూరులో పోలీసులకు దొరికిందని తమకు సమాచారం అందిందని.. అయితే, తమ కుమార్తెను బెంగుళూరులోని ఓ కాలేజీలో చేర్పించడానికి తన అన్న చరణ్ సింగ్ ఇంటికి రజనీ వెళ్లిందని.. చరణ్ సింగ్ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించి చరణ్ సింగ్తో పాటు రజనీని కూడా అరెస్ట్ చేసినట్లు తమకి సమాచారం ఉందన్నారు. అయితే, ఒకవేళ రజనీ నిజంగానే దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు తేలితే పార్టీ తరపున చర్యలు తీసుకుంటామని చెప్పారు.