Kodumur MLA Sudhakar: వచ్చే ఎన్నికలలో పోటీ నుండి తప్పుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 12:52 PM

Kodumur MLA Sudhakar: వచ్చే ఎన్నికలలో పోటీ నుండి తప్పుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!

Kodumur MLA Sudhakar: ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉన్నా.. రాజకీయాలు మాత్రం రసకందాయంగా మారుతున్నాయి. ఒకపక్క ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు సిద్ధమవుతుంటే.. అధికార వైసీపీలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ కంచుకోట నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై విమర్శల దాడికి దిగగా.. వాళ్ళని పార్టీ పదవుల నుండి తప్పించారు. మరో ఎమ్మెల్యే కూడా అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారు.

అదలా ఉండగానే మరో జిల్లాలో కూడా వైసీపీలో అసంతృప్తి నేతలు బయటపడుతున్నారు. కర్నాలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు గ్రామీణ మండలంలోని ఉల్బాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధాకర్.. రానున్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో స్దానిక నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఎమ్మెల్యే ఒక్కసారిగా ఇలా సడెన్‌గా ప్రకటన చేయడంతో నేతలు, కార్యకర్తలు అందరూ నోరెళ్లబెట్టారు. సుధాకర్ కు సోదరుడు సుదర్శన్ తో విభేదాలతో ఆయన గతంలోనే టీడీపీలో చేరారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సుధాకర్ పై సుదర్శన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సుధాకర్ పచ్చి మోసగాడని.. నమ్మక ద్రోహి అని.. సొంత ప్రయోజనాలే తప్ప ఎవరినీ పట్టించుకోరని సొంత అన్నయ్య సుదర్శన్ విరుచుకుపడ్డారు. సుధాకర్‌ను నమ్మి కోడుమూరు ప్రజలే కాదు.. సొంత కుటుంబసభ్యులమూ మోసపోయామని చెప్పారు.

అదలా ఉండగానే ఈ మధ్యనే సుధాకర్‌పై మాజీ మండల అధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్ నాయుడు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన రౌడీమూకలను అందలం ఎక్కించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్ రావడానికి కష్టపడిన వారిని మరిచిపోయిన సుధాకర్ నమ్మకద్రోహి అంటూ విమర్శించారు. నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలతో సుధాకర్ వైభవం తగ్గిపోగా.. ఇప్పుడు ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్లు అర్ధమవుతుంది. సుధాకర్ తప్పుకున్నట్లు ప్రకటించడంతో.. కోడుమూరు వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.