Viveka Case: వివేకా హత్య కేసు.. విచారణకి పిలిచిన సీబీఐ.. 5 రోజుల గడువు కోరిన ఎంపీ అవినాష్!

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 08:16 AM

Viveka Case: వివేకా హత్య కేసు.. విచారణకి పిలిచిన సీబీఐ.. 5 రోజుల గడువు కోరిన ఎంపీ అవినాష్!

Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి నోటీసులు అందజేశారు.

మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి.. లేఖ ద్వారా సీబీఐ అధికారులకి సమాధానం ఇచ్చారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తాని.. కాకపోతే మంగళవారం రోజు పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉందని.. ఆ రోజున విచారణకు హాజరు కాలేనని తెలిపారు.

అంతేకాదు తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంవల్ల మంగళవారం రాలేనని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి.. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. మంగళవారం తన నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు ప్లాన్ చేసి ఉందని.. మరో నాలుగు రోజుల పాటు కూడా బిజీగా ఉంటానని.. ఆ తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు రావడానికి సిద్ధమని చెప్పినట్లు తెలుస్తుంది.

ఎంపీకి ఇచ్చిన నోటీసుల్లో ఉన్న సీబీఐ అధికారి ఫోన్‌ నంబరుకు కాల్‌ చేసి అవినాష్ ఈ మేరకు గడువు కోరినట్లు తెలుస్తోంది. మరి అవినాష్ రెడ్డి సమాధానంపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇక, వివేకా కేసు విషయానికి వస్తే.. 2019 మార్చి 15న పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా హత్య జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడం అందరినీ షాక్ కి గురిచేయగా.. అప్పటి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఆ తర్వాత ఈ కేసు ఏపీ హైకోర్టుకు.. అక్కడ నుండి సీబీఐకి వెళ్లాయి. ఈ కేసు విచారణ వేగవంతంగా లేదని వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ మధ్యనే కేసును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. తెలంగాణకు బదిలీ అయిన తర్వాత విచారణ మొదలుపెట్టిన సీబీఐ ముందుగా ఎంపీ అవినాష్‌కు ఇప్పుడు నోటీసులిచ్చింది. ముందుగా సోమవారం అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కోసం ఆరా తీసి.. ఆ తర్వాత అవినాష్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ కేసుపై ఒక్కసారిగా ఉత్కంఠ మొదలైంది.