CM KCR: వ్యవసాయం పండగైన నాడే దేశానికి సంపూర్ణ క్రాంతి.. కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 01:16 PM

CM KCR: వ్యవసాయం పండగైన నాడే దేశానికి సంపూర్ణ క్రాంతి.. కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

CM KCR: దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి యావత్‌ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు.

ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునురుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్య రాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని సీఎం పేర్కొన్నా రు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని సీఎం ఆన్నా రు.

తెలంగాణ అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందనీ సీఎం పేర్కొన్నారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది తార్కాణమని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే సాగు విస్తీర్ణం ఉన్నదని, నేడు అది 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక పరిణామమని చెప్పారు.

ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం నేడు తెలంగాణలో పండుగలా మారిందని.. వ్యవసాయాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో ఇప్పుడు తొణికిసలాడుతోందని వెల్లడించారు. ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో నెలకొల్పుతామని చెప్పారు. యావత్‌ భారత్‌ ప్రజల సహకారంతో దేశ వ్యవసాయరంగ నమూనాను మార్చి గుణాత్మక అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరముందన్న సీఎం ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.