Warangal: కిలాడి దొంగలు.. వ్యవసాయ బావి పట్టించేసింది.. ఎలా అంటే?

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 12:29 PM

Warangal: కిలాడి దొంగలు.. వ్యవసాయ బావి పట్టించేసింది.. ఎలా అంటే?

Warangal: కొందరు యువకులు లేడీస్ హాస్టల్స్ నే టార్గెట్ చేసుకున్నారు. అంటే అక్కడున్న మహిళలపై ఏదో అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని కాదు. కేవలం లేడీస్ హాస్టల్స్ లోనే దొంగతనాలు చేస్తున్నారు. ఆ తర్వాత చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. లేడీస్ హాస్టల్లో చోరీలు హస్మకొండ జిల్లాలో కలకలం రేపాయి.

అక్కడి ఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో లాప్టాప్ లు, సెల్ ఫోన్లు దొంగతనం చేశారు. హాస్టల్ బాత్రూమ్ డోర్ బద్దలు కొట్టి మరి దొంగతనానికి పాల్పడ్డారు. హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ శివారులోని ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ లేడీస్ హాస్టల్‌లో చోరీకు వచ్చారు. విద్యార్ధినులకు చెందిన 3 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ దొంగిలించారు. అనంతరం పారిపోతుండగా అనూహ్యంగా పట్టుబడ్డారు.

సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన తోట చరణ్‌ తమిళనాడులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. అతడి సమీప బంధువు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వీరితో పాటు గ్రామానికి చెందిన మరో యువకుడు కూడా సంక్రాంతి సెలవులకు ఊరికి వచ్చాడు. ముగ్గురు కలిసి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ప్రైవేటు హాస్టల్‌లో చోరీ చేయడానికి ఎంచుకున్నారు.

ఆదివారం తెల్లవారుజామున హాస్టల్‌లోకి చొరబడిన నిందితులు అమ్మాయిల మంచాల పక్కనున్న 3 స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను చోరీ చేశారు. బయటపడే మార్గం లేక అక్కడే ఉన్న బాత్‌రూమ్‌లో దాక్కున్నారు. ఉదయం 8 గంటలకు బాత్‌రూమ్‌లో దొంగలున్నారని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది గమనించిన దొంగలు భవనంపై నుంచి కిందకు దూకడంతో చరణ్‌ పాతకాలపు వ్యవసాయ బావిలో పడిపోగా మిగతా ఇద్దరు యువకులు పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయారు. బావిలో పడిపోయిన చరణ్‌ను పోలీస్ సిబ్బంది తాడు సాయంతో బయటకు లాగి స్టేషన్‌కు తరలించగా.. మరో నిందితుడు మధును సైతం పట్టుకున్నారు. వీరి వెంట వచ్చిన మరో యువకుడు మాత్రం పరారయ్యాడు.