iTDP: సోషల్ మీడియా కేసు.. సీఐడీ విచారణకి హాజరైన చింతకాయల విజయ్!

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 12:27 PM

iTDP: సోషల్ మీడియా కేసు.. సీఐడీ విచారణకి హాజరైన చింతకాయల విజయ్!

iTDP: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు, ఐటీడీపీ ఇంచార్జ్ చింతకాయల విజయ్ ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. పార్టీ నేతలు, లాయర్లతో కలిసి విజయ్ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. విజయ్ సీఐడీ విచారణకు హాజరవుతున్నారనే సమాచారంతో కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా బలగాలను మోహరించారు.

విజయ్ పై కేసు ఏంటి?
సీఎం జగన్ భార్య వైఎస్ భారతి లక్ష్యంగా గత ఏడాది సెప్టెంబర్ లో సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అయింది. ‘భారతి పే’ పేరుతో ఆమె అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ పోస్టు పెట్టారు. ఐటీడీపీ ద్వారానే ఈ పోస్ట్ సర్కులేట్ అయిందంటూ.. విజయ్ పై ఏపీ సీఐడీ అధికారులు ఐపీసీ సెక్షన్లు 419, 469, 153 ఏ, 505 (2), 102 బీ, రెడ్ విత్ 34, 66 (సీ)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 2000ల కింద కేసు నమోదు చేశారు.

విచారణకి నోటీసులు..
విచారణకు హాజరు కావాలని విజయ్ కి సీఐడీ అధికారులు అప్పుడే నోటీసులు జారీ చేశారు. దీనికి గతంలో విజయ్ విచారణకు హాజరుకాకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయ్ ఆ రోజున విచారణకు హాజరు కాలేనని మరోసారి కోర్టును ఆశ్రయించి ఈరోజు విచారణకు హాజరు కాగలనని చెప్పారు.

దీంతో ఈరోజు ఆయన హాజరవుతారని కోర్టు సీఐడీకి చెప్పింది. అంతేకాదు, విజయ్ తరపున ఓ లాయర్ కూడా విచారణ గదిలో ఉంటారని.. ఆయన సమక్షంలోనే విచారణ జరగాలని కూడా కోర్టు చెప్పింది. మొత్తానికి విజయ్ కోరినట్లుగా ఈరోజు విచారణకు హాజరవగా.. కోర్టు చెప్పినట్లే విజయ్ తో పాటు ఆయన లాయర్ ను కూడా సీఐడీ అధికారులు అనుమతించారు. మరి, విచారణలో ఏం తేల్చనున్నారు? విచారణ అనంతరం పరిస్థితులు ఏంటన్నది చూడాల్సి ఉంది.