Janasena: పల్నాడు ప్రజా సమస్యల పెట్టె.. జనసైనికుడి ప్రయత్నానికి పవన్ గిఫ్ట్స్!

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 07:59 PM

Janasena: పల్నాడు ప్రజా సమస్యల పెట్టె.. జనసైనికుడి ప్రయత్నానికి పవన్ గిఫ్ట్స్!

Janasena: ఎన్నికలలో ఓట్ల సంగతెలా ఉన్నా జనసేన అధినేతకి ఇటు సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా అభిమానులకు కొదువేలేదు. పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అంటే వంద మాటలు అనేలా విమర్శలకు దిగే అభిమానులతో పాటు పవన్ వస్తున్నాడంటే.. ఒకరోజు ముందే అక్కడ వాలిపోయే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే జనసేనాని విమర్శించిన వాళ్ళని చీల్చి చెండాడే వాళ్ళు కోట్లలోనే ఉన్నారు.

అయితే, ఓ జనసైనికుడు మాత్రం భిన్నంగా ఓ గొప్ప ప్రయత్నం చేశాడు. పల్నాడు ఫిర్యాదుల పెట్టె పేరుతో తన సొంత వాహనంలో పల్నాడు ప్రాంతంలో వీధి వీధి తిరుగుతూ.. గడప గడపకు వెళ్లి వాళ్ళ సమస్యలను రాసి ఆ పెట్టెలో వేయాలని కోరుతున్నాడు. ఆ సమస్యలను సరాసరి పవన్ కళ్యాణ్ కు చేరుస్తున్నారు. దీంతో ఈ జనసైనికుడు ప్రయత్నానికి ఫిదా అయిన పవన్ కళ్యాణ్.. అతన్ని పిలిచి మెచ్చుకొని.. ఆర్ధిక సాయంతో పాటు బహుమతులు ఇచ్చి పంపించాడు.

బాలాజీ అనే జనసేన పార్టీ కార్యకర్త ‘పల్నాడు ప్రజాసమస్యల పెట్టె’ పేరుతో.. పల్నాడు ప్రాంతంలో ఊరూరూ తిరుగుతూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పవన్ కళ్యాణ్‌కు అందేలా చేస్తున్నారు. బాలాజీ ప్రయత్నం గురించి తెలిసిన పవన్.. బాలాజీని జనసేన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. బాలాజీ ఆలోచనను మెచ్చుకుని అతడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చి ప్రశంసించారు. బాలాజీ ప్రయత్నాన్ని అభినందిస్తూ.. అతడికి కొంత మొత్తం నగదు.. మొబైల్‌ బహూకరించారు. తమ ప్రాంత సమస్యలు తెలుసుకునేందుకు బాలాజీ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి స్ఫూర్తితో నేను ఈ కార్యక్రమం ప్రారంభించాను. ఆ ప్రాతం ప్రజల సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు పల్నాడు ప్రజాసమస్యల పెట్టె ప్రారంభించానని తెలిపాడు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని.. తమ ప్రాంత ప్రజా సమస్యలను జనసేన అధినేత పవన్‌ దృష్టికి తీసుకెళతానని తెలిపారు.