PM Modi: మరోసారి మోడీ తెలంగాణ టూర్ క్యాన్సిల్.. రాజకీయ వర్గాలలో చర్చగా మారిన అంశం!
![PM Modi: మరోసారి మోడీ తెలంగాణ టూర్ క్యాన్సిల్.. రాజకీయ వర్గాలలో చర్చగా మారిన అంశం!](https://kaburulu.com/wp-content/uploads/2023/02/PM-Modi-1.jpg)
PM Modi: మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన రద్దయింది. ఈనెల 13వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణకు రావాల్సి ఉంది. తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ మేరకు కేంద్రం నుండి షెడ్యూల్ ఖరారు చేసి తెలంగాణలో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ.. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. తెలంగాణలో మోడీ పర్యటన రద్దయింది.
గత నెలలో కూడా ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తారని ప్లాన్ చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని సికింద్రాబాద్ కి వచ్చి ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ.. అప్పుడు కూడా ఏవో కారణాలతో ప్రధాని ఇక్కడకి రాకుండానే వర్చువల్ ద్వారా వందే భారత్ రైలును ప్రారంభించారు. అప్పుడే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కొన్ని అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు.
కానీ, ఎప్పటి నుండి తెలంగాణలో ప్రధాని పర్యటన కోసం స్థానిక నేతలు ఎదురుచూస్తుండగా ఈనెలలో సికింద్రాబాద్ లో మిగిలిన అభివృద్ధి పనుల ప్రారంభం చేయాలని అనుకున్నారు. కానీ, ఈసారి కూడా స్థానిక నేతల ఆశలు ఫలించలేదు. అయితే.. ప్రధాని మోడీ బదులుగా.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. అది కూడా నరేంద్ర మోడీ షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే అంటే ఈనెల 11నే అమిత్ షా తెలంగాణకు రానున్నారు.
ఈ నెల 11న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానుండగా, లోక్సభ ప్రవాస్ యోజన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లు లేదా మహబూబ్నగర్, నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానాల్లో అమిత్ షా పర్యటన ఉండనుండగా.. పార్లమెంట్ స్థానాలతో సంబంధం లేకుండా ఏదైనా ఒక శక్తి కేంద్రంలోని కార్యకర్తలతో అమిత్ షా భేటీ కానున్నారు. సంస్థాగతంగా పార్టీ ఎంతమేరకు బలోపేతమైందనే విషయాలను స్వ యంగా అడిగి తెలుసుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరును తెలంగాణ పర్యటనకు రానున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.