Mukarram Jah: హైదరాబాద్కు నిజాం పార్థీవదేహం.. అంత్యక్రియలకి భారీ ఏర్పాట్లు!
![Mukarram Jah: హైదరాబాద్కు నిజాం పార్థీవదేహం.. అంత్యక్రియలకి భారీ ఏర్పాట్లు!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Mukarram-Jah.jpg)
Mukarram Jah: హైదరాబాద్ సంస్థానం ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కత్ ఆలీఖాన్ ముకర్రం ఝా శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్లోని ఆయన నివాసంలో మరణించిన సంగతి తెలిసిందే. పార్థీవ దేహం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని శంషాబాద్కు తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పాతబస్తీ చౌమహల్లా ప్యాలెస్కు భారీ పోలీసు బలగాల మధ్య రోడ్డు మార్గం ద్వారా నిజాం భౌతిక ఖాయాన్ని తీసుకొచ్చారు. అక్కడ్నుంచి చౌమహల్లా ప్యాలెస్కు తరలించారు.
మంగళవారం నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే చూసేందుకు అనుమతించగా.. ముకర్రం ఝా పార్థివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ముకర్రం ఝా భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు. కాగా, బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ముకర్రం ఝా భౌతిక ఖాయాన్ని నిజాం అభిమానులకు, ప్రజలకు సందర్శనార్థం పెట్టనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కా మసీదు వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఆయన కడసారి చూపు కోసం బంధు మిత్రులతో పాటు సాధారణ జనం భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చౌమహల్లా ప్యాలెస్ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడైన ముకర్రం ఝా అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నారు. ఆయన చివరి కోరిక మేరకు తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కనే ముకర్రం ఝా పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ లో ఖననం చేయనున్నారు.