KTR-Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో కేటీఆర్.. బిజినెస్, బిర్యానీలపై చర్చ

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 03:19 PM

KTR-Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో కేటీఆర్.. బిజినెస్, బిర్యానీలపై చర్చ

KTR-Satya Nadella: ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ సీఈఓ, తెలుగు వారైన సత్యనాదెళ్ళతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సత్య నాదెళ్ల నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేశారు. అంతకు ముందు రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోదీని కలిసిన సత్యనాదెళ్ళ ఆ త‌ర్వాత బెంగుళూరులో జ‌రిగిన ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌ కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో ‘చాట్‌ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఛాట్‌ రోబోను కూడా నాదెళ్ల పరిచయం చేశారు.

ఆ రోబోతో ఆయ‌న మాట్లాడుతూ.. భవిష్యత్తులో పాపులర్‌ సౌత్‌ ఇండియన్‌ టిఫిన్స్‌ ఏముంటాయని ఆయన చాట్‌ రోబోను కూడా ప్రశ్నించారు. దీనికి ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ రోబో సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీని సౌత్‌ ఇండియా టిఫిన్‌ అని తనను అవమానించొద్దన్నారు. దీంతో వెంటనే చాట్‌ రోబో క్షమాపణ కూడా చెప్పింది. ఇక, ఈరోజు హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా ఆయనతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం గురించి మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు.

ఇద్ద‌రు హైద‌రాబాదీలు క‌ల‌వ‌డం శుభ‌దినం అవుతుంద‌ని మంత్రి కేటీఆర్ త‌న పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు స‌త్య నాదెళ్ల‌తో బిజినెస్‌, బిర్యానీ గురించి చ‌ర్చించిన‌ట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఐటీ, అనుబంధ రంగాల అభివృద్ధితో పాటు హైదరాబాద్‌లో వాటికి గల అపార అవకాశాలను మంత్రి కేటీఆర్, సత్య నాదెళ్లకు వివరించినట్లు తెలుస్తోంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వ్యాపార విధానాలు, ప్రోత్సాహకాల గురించి కూడా నాదెళ్ళకు తెలిపినట్లు సమాచారం. అదలా ఉండగా.. కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్ లో కూడా బిర్యానీ గురించి ప్రస్తావించడంతో కేటీఆర్ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.